రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2023-09-20T00:11:27+05:30 IST
పాత కక్షల నేపథ్యంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కర్రలతో దాడి చేయడంతో ఒకరి మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
పాతకక్షలే కారణం
మహదేవపూర్, సెప్టెంబరు 19: పాత కక్షల నేపథ్యంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం జరిగింది. కాళేశ్వరం ఎస్సైలక్ష్మణ్రావు తెలిపిన వివరాల ప్రకారం..
పట్టి రాములు, పట్టి మల్లేష్ అన్నదమ్ములు. గ్రామంలో రాములు సుంకరి పని(వీఆర్ఏ తరహా) చేసేవాడు. కొన్నేళ్ల క్రితం రాములు మృతి చెందాడు. దీంతో అతడి అల్లుడు నారా ఈశ్వర్, తమ్ముడు మల్లేష్ మధ్య పని విభజన జరిగింది. ఒకొక్కరు తలా కొన్ని రోజుల చొప్పున విధులు నిర్వర్తించేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన అన్నకు సంబంధించిన పని కాబట్టే తానొక్కడినే చేసుకుంటానని మల్లేష్ ఒక్కడే కొనసాగాడు. ఇదే క్రమంలో ఇటీవల వీఆర్ఏల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో మల్లేష్ ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. దీంతో అతడిపై ఈశ్వర్ మరింత కక్ష పెంచుకున్నాడు. మరోవైపు రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో గొడవ ఉంది. అన్నదమ్ములైన రాములు, మల్లేష్కు ఉమ్మడిగా ఉన్న వ్యవసాయ భూమిలో వివాదం చోటుచేసుకుంది. ఇలా 15 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య పగ రగులుతూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం మల్లేష్ ఇంట్లో ఉండగా అతడిపై ఈశ్వర్, అతడి కుమారుడు తిరుమల్, అత్త పట్టి వెంకటమ్మ (రాములు భార్య) దాడి చేశారు. కర్రలతో చితకబాదడంతో మల్లేష్, అతడి భార్య పోషక్క, కుమారుడు హరీశ్ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మణ్రావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని పోలీసు వాహనంలో మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి పంపారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే అదే రోజు సాయంత్రం మల్లేష్ మృతి చెందాడు. అతడి భార్య పోషక్క, కుమారుడు హరీశ్ పరిస్థితి విషమంగానే ఉంది. మృతుడి బావమరిది లింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మహదేవపూర్ సీఐ టి.కిరణ్ విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ఈశ్వర్, తిరుమల్, వెంకటమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వినాయక చవితి వేళ చోటుచేసుకున్న ఈ ఘటన మండలంలో కలకలం రేపింది.