అయ్యో.. దేవుడా!

ABN , First Publish Date - 2023-03-19T00:08:49+05:30 IST

దేవాదాయ శాఖ – రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఆలయాల భూములకు శాపంగా మారింది. ఆలయాల కింది కోట్లాది రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా దేవాదాయ శాఖగానీ, వారి ఫిర్యాదు మేరకు రెవెన్యూ శాఖగానీ పట్టించుకోవడం లేదు.

అయ్యో.. దేవుడా!
సిద్దేశ్వరాలయం, పద్మాక్షి దేవాలయం, ఆలనాపాలన లేని వీరపిచ్చమాంబ మఠం

నగరంలో ఆలయాల భూములు యథేచ్ఛగా కబ్జా

కోట్లాది రూపాయల విలువ.. చోద్యం చూస్తున్న అధికారులు..

దేవాదాయ, రెవెన్యూ మధ్య సమన్వయ లోపం

భూముల సర్వేల్లో తీవ్ర జాప్యం

ఇదే అవకాశంగా పేట్రేగిపోతున్న కబ్జాదారులు

లోకాయుక్తలో ఫిర్యాదు చేసినా స్పందన కరువు

హనుమకొండ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : దేవాదాయ శాఖ – రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఆలయాల భూములకు శాపంగా మారింది. ఆలయాల కింది కోట్లాది రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా దేవాదాయ శాఖగానీ, వారి ఫిర్యాదు మేరకు రెవెన్యూ శాఖగానీ పట్టించుకోవడం లేదు. ఈ రెండు శాఖల అధికారుల మధ్య లోపించిన పరస్పర సహకారం కబ్జాదారులకు వరంగా మారింది. ఆక్రమణకు గురైన భూముల సర్వే నిర్వహించే విషయంలో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి లోకాయుక్త ఎదుట ఫిర్యాదు చేయడం.. రెండు శాఖల మధ్య సమన్వయ లేమికి అద్దం పడుతోంది. ఆలయ భూముల అన్యాక్రాంతంపై ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం దేవాదాయ శాఖకు ఉన్నా.. ఇందుకు అవసరమైన సర్వే నెంబర్లు, ఇంటినెంబర్లతో కూడిన సవివరమైన సర్వే నివేదిక అవసరం. ఈ సర్వేలో భూమిక పోషించాల్సింది రెవెన్యూ, నగర పాలక సంస్థ. రెవెన్యూ, దేవాదాయ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో సర్వేలో జాప్యం జరిగి కబ్జాదారులు మరింత రెచ్చిపోయేందుకు అవకాశం కలుగుతోంది.

22.11 ఎకరాలు కబ్జా

హనుమకొండలోని రంగనాయక స్వామి దేవాలయం (పెద్ద కోవెల), సుప్రసిద్ధమైన సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి దేవాలయం, ఇదే ప్రాంతంలోని మాతా మునులపాటి వీరపిచ్చమాంబ మఠం, వరంగల్‌ మట్టెవాడలోని వేణుగోపాల స్వామి దేవాలయాలకు చెందిన మొ త్తం 22..11 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూముల ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.100కోట్లకుపైనే ఉంటుందని అంచనా. మొత్తం 61 మంది ఈ దేవుడి మాన్యాల్లో పాగా వేశారు. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించుకున్నారు. అపార్టుమెంట్లను కట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. వీటితో పాటు మరికొన్ని దేవాలయాల భూములు కూడా అక్రమార్కులు ఆక్రమించుకున్నారు.

కబ్జాదారులతో కుమ్మక్కు

వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, కాకతీయుల వారసత్వ సంపద పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు చీకటి రాజు చాలా కాలంగా నగరంలోని పురాతన ఆలయాల భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. భూముల ఆక్రమణను దేవాదాయశాఖ అధికారుల దృష్టికి పలు సార్లు తీసుకువచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో వీరు లోకాయుక్తను ఆశ్రయించారు. విచారణలో భాగంగా ఆలయ భూములకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావలసిందిగా లోకాయుక్త దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినప్పటికీ వారు హాజరు కాక ఈవో స్థాయి అధికారులను పంపి తప్పించకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల తీరుపై లోకాయుక్త అసంతృప్తి వ్యక్తం చేయడంతో బుధవారం అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి హాజరై భూముల సర్వేలో జాప్యానికి రెవెన్యూ అధికారుల ను బాధ్యులను చేసే ప్రయత్నం చేశారు. ఏసీ వివరణకు సంతృప్తి చెందని లోకాయుక్త జస్టిస్‌ ‘మీ ఆస్తి అయితే ఇలాగే చేస్తారా..’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడం ద్వారా సర్వే చేయించి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించడం గమనార్హం.

సర్వే జరిగినా..

నిజానికి ఈ ఆలయాల భూముల సర్వే కిందటేడు అక్టోబర్‌లోనే జరిగింది. ఏఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి కబ్జా అయింది..? స్పష్టం గా బయటపడింది. కబ్జా చేసిన వారు ఎవరో కూడా తెలిసింది. అయి నా ఇప్పటి వరకు దేవాదాయశాఖ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు లేదు. వారికి కనీసం నోటీసులు అయినా ఇచ్చారా అన్నది అనుమానమే. ఇప్పటికే వారిపై కేసులు పెట్టాలి. అలాంటిదేమీ జరిగినట్టు కనిపంచడం లేదు. పైగా అన్యాక్రాంతమైన భూములను ఇంటినెంబర్లతో సహా సర్వే జరపాల్సి ఉందని లోకాయుక్తకు అధికారులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సర్వే పేరుతో కాలయాపన చేయడం ద్వారా ఆక్రమణదారులను కాపాడేందుకు దేవాదాయ శాఖ అధికారులు పరోక్షంగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇదిగో ఆక్రమణల చిట్టా..

హనుమకొండ రాగన్నదర్వాజలోని రంగనాయక స్వామి (పెద్ద కోవెల) ఆలయానికి చెందిన 14.19 ఎకరాల భూమిలో 9.32 ఎకరాలు ఆక్రమణకు గురైంది. సర్వే నెంబరు 552, 591/1, 807, 534/ఏ, 534/బి, 357/ఏ 357/ఏ/2, 357/ఏ3, 357/బి, 357/సి, 357/డి,357/ఈ, 356/ఏ, 356/బి, 533/ఏ, 533/ఏ 533/బి సర్వేనెంబర్లలోని ఈ భూమిలో పక్కా ఇళ్లు, భవనాలు వెలిసాయి.

వరంగల్‌ మట్టెవాడలోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 4.21 ఎకరాల భూమిలో 1.11 ఎకరాలు కబ్జా అయింది. సర్వే నెంబర్లు 388, 394, 493, 494, 495, 496, 497, 499, 500లో ఉన్న ఈ భూమిలో కూడా పక్కా భవనాలను నిర్మించారు. 9 గుంటల భూమిలో ఒక కబ్జాదారుడు ఏకంగా స్కూలు భవనాన్నే నిర్మించాడు. మరొకరు ఫంక్షన్‌ హాల్‌ కట్టాడు. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం కింద మొత్తం 72.23 ఎకరాల దేవుడి మాన్యం ఉండగా ఇందులో 6.22 ఎకరాలు ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్లు. 901, 902, 903, 902,905, 906, 908, 890/బి, 880లోని ఈ భూమిలో కొంత భాగం శ్మశానవాటిక కిందకు పోయింది. కొంత భూమిలో అనువంశిక అర్చకులు పక్కా భవనాన్ని నిర్మించుకున్నారు. షెడ్లను వేసుకున్నారు.

సిద్ధేశ్వరాలయం కింద 24.03 ఎకరాల భూమి ఉండగా ఇందులో 2.24 ఎకరాలు పరాధీనమైంది. ప్రముఖ విద్యా సంస్థల అధిపతి సర్వే నెంబర్లు 882లోని 6.04 ఎకరాల్లో 9 గుంటల భూమిని, సర్వే నెంబరు 890లో 2.15 ఎకరాలను ఆక్రమించుకొని బహుళ అంతస్తు భవనాలు, షెడ్లను దర్జాగా నిర్మించుకున్నాడు. మాతా మునులపాటి వీరపిచ్చమాంబ గుడికి చెందిన 1.14 ఎకరాల్లో 30 గుంటలను ఏడుగురు వ్యక్తులు ఆక్రమించుకున్నారు.

నగరంలోని మరికొన్ని ఆలయాల భూములు స్వాహా అయ్యాయి. ఇటీవల భద్రకాళి దేవాలయానికి చెందిన పెద్దమ్మగడ్డలోని భూమిని కూడా కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించగా ఈ విషయమై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా ఏళ్ల క్రితమే వరంగల్‌లోని కుంటిభద్రయ్య గుడికి (శివాలయం) చెందిన సుమారు 30 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతమైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-19T00:08:49+05:30 IST