అంతంతమాత్రమే..!
ABN , First Publish Date - 2023-06-26T23:45:38+05:30 IST
మక్కల ధరలు బయటి మార్కెట్లలో తగ్గడంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు అంతంతమాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధరకు క్వింటాలుకు రూ.1,962 కొనుగోళ్లు చేపట్టారు. 29 వేల మెట్రిక్ టన్నుల మక్కల సేకరణకు లక్ష్యం పెట్టుకోగా 9627 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. వాటి విలువ రూ.18.89 కోట్లు. అలాగే ధాన్యం కొనుగోళ్లు కూడా పూర్తయ్యాయి.
పూర్తయిన మక్కలు, ధాన్యం కొనుగోళ్లు
9,627 మెట్రిక్ టన్నుల మాత్రమే మక్కల సేకరణ
1.13 మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీదు
వడ్ల కొనుగోళ్లలో పీఏసీఎస్లే టాప్
మహబూబాబాద్ అగ్రికల్చర్, జూన్ 26 : మక్కల ధరలు బయటి మార్కెట్లలో తగ్గడంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు అంతంతమాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధరకు క్వింటాలుకు రూ.1,962 కొనుగోళ్లు చేపట్టారు. 29 వేల మెట్రిక్ టన్నుల మక్కల సేకరణకు లక్ష్యం పెట్టుకోగా 9627 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. వాటి విలువ రూ.18.89 కోట్లు. అలాగే ధాన్యం కొనుగోళ్లు కూడా పూర్తయ్యాయి. జిల్లాలో 1.80 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా పెట్టుకోగా 1.13 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు పూర్తి చేశారు. కొన్ని ఒడిదు డుకుల మధ్య మక్కలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.
జిల్లాలో మక్కల ధరలు తగ్గడంతో...
జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లలో మక్కలు ప్రైవేట్ వ్యాపారులు ఖరీదులు చేశారు. ఈ మక్కల సీజన్ ప్రారంభమైన నాటి నుంచి మినిమం సపర్టోప్రైజ్(ఎంహెస్పీ) ఎక్కువగా పలకాయి. క్వింటాలుకు రూ.2వేల పైనే ధరలు పలుకుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్న సమయంలోనే గత మార్చి నెలలో మక్కలు ధరలు తగ్గుముఖం పట్టాయి. మక్కలు క్వింటాలుకు రూ.1,749 నుంచి రూ.1,849 వరకు ధరలు పలుకుగా అత్యధికంగా మక్కల రాశులు రూ.1,700లకే వ్యాపా రులు ఖరీదు చేశారు. దీంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ప్రభుత్వ మద్దతు ధరతో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నలకు పూర్తిగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో మార్క్ఫెడ్ సంస్థ రంగంలోకి దిగింది.
మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఖరీదులు...
జిల్లాలో రెండేళ్ల తర్వాత మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కజొన్నల ఖరీదులు ప్రారంభమయ్యాయి. గత రెండేళ్లు మొక్కజొన్నలకు ఎంఎస్పీ కంటే అధిక ధరలు పలుకుతుండడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ యాసంగి సీజన్లో ముఖ్యమంత్రి ఆదేశాలతో 37 మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని ముందుగా అనుకున్నప్పటికి 26 కేంద్రాల్లోనే ప్రారంభమయ్యాయి. మే 4 నుంచి బయ్యారం నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 23 మొక్కజొన్న కొను గోలు కేంద్రాల్లో మాత్రమే ఖరీదులు చేపట్టగా 2,449 మంది రైతుల నుంచి 1,92,549 సంచుల్లో 9,627 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను ఖరీదు చేశారు. ఆ మక్కల విలువ రూ.18.89 కోట్లు. ఆ మొత్తం డబ్బు లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అధికంగా కేసముద్రం మార్కెట్, ఇంటికన్నె, గుండ్రాతి మడుగు, చిన్న ముప్పారం, కోమట్లగూడెం, నెల్లికుదురు, బయ్యారం, కస్తూరినగరం, జమిస్తాన్పురం, మడిపెల్లి, బంగారి చెలిమితండ, చిన్ననాగారంలలో రైతులు ఎక్కువ కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించారు. అయితే అత్యధిక మంది రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకముందే ప్రైవేట్ వ్యాపారులకు ఎంఎస్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవడంతో కొనుగోలు కేంద్రాల్లో తక్కువ మంది రైతులు విక్ర యించారు. కాగా, రైతు సమగ్ర సమాచారం పోర్టల్ మక్కలు సాగు చేసినట్లు నమోదు అయితేనే కొను గోలు కేంద్రాల్లో ఖరీదులు చేపట్టారు. లేని రైతులకు తీసుకోలేదు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి..
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ, మెప్మా, డీహెచ్ఎస్వో ఆధ్వర్యంలో 192 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 188 కేంద్రాల ద్వారానే ధాన్యం ఖరీదులు చేపట్టారు. 22,120 మంది రైతుల నుంచి 1,13,365 క్వింటాళ్ల ఖరీదులు చేయగా దాని విలువ సుమారు రూ.232.73 కోట్లు. అందులో 14,385 మంది రైతులకు చెందిన రూ.136.85 కోట్లు గత వారం రోజుల క్రితం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 4,779 మంది రైతులకు రూ.72.53 కోట్లు చెల్లించాల్సి ఉంది. సెలవులు రావడంతో రైతుల ఖాతాల్లోకి ఆలస్యంగా జమ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఖరీదుల్లో పీఏసీఎస్ టాప్
జిల్లా ప్రాథమిక సహాకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశా రు. 14,934 మంది రైతుల నుంచి 80,418 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దాని విలువ రూ.165.10 కోట్లు. ఇప్పటి వరకు 9,782 మంది రైతులకు రూ.96.16 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,077 మంది రైతులకు రూ.36.08లక్షలు జమ చేయాలి. నెమ్మదిగానే కొనుగోళ్లు జరుగుతున్న సహాకార సంఘం అధికారి చెప్పారు.
9,627 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఖరీదు : ఐలోని శ్యాంకుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్
రెండేళ్ల తర్వాత జిల్లాలో మొక్కజొన్నల ఖరీదులు ప్రారంభం చేశాం. అంతకుముందు ఎంఎస్పీ అధిక ధరలు ఉండడంతో ఆ రెండేళ్లు ఖరీదులు చేపట్టలేదు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో జిల్లాలో 23 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా 9,627 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు ఖరీదులు చేశాం. రైతుల ఖాతాల్లోకి నయా పైసా బ్యాలెన్స్ లేకుండ రూ.18.83 కోట్లు చెల్లించాం. రైతు సమగ్ర సమాచార పోర్టల్లో ఉన్న రైతుల పేర్లపై ఉన్న మొక్కజొన్నలనే తీసుకున్నాం.
ధాన్యం ఖరీదుల్లో పీఏసీఎస్లదే అత్యధికం : ఖుర్షీద్, జిల్లా సహాకార అధికారి
జిల్లాలోని ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో పీఏసీఎస్ల ద్వారానే అత్యధికంగా ధాన్యం ఖరీదులు చేశాం. 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు రాకుండ ధాన్యం ఖరీదులు చేపట్టాం. 14,934 మంది రైతుల నుంచి 80,418 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. అందులో కొంతమందికి ఆన్లైన్ పేమెంట్లు చేయగా మరికొంతమంది రైతులకు ధాన్యం చెల్లింపులు చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.