Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

ABN , First Publish Date - 2023-02-22T19:25:02+05:30 IST

వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో చదువుకుంటున్న ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సీనియర్ మెడికో వేధింపులతో తనకు తానే హానికర ఇంజక్షన్ తీసుకుంది ప్రీతి...

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో చదువుకుంటున్న ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సీనియర్ మెడికో వేధింపులతో తనకు తానే హానికర ఇంజక్షన్ తీసుకుంది ప్రీతి. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించగా అంతకంతకూ ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు విద్యార్థినిని తరలించారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ వల్లే తన కుమార్తెకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే.. హానికర ఇంజక్షన్ (విషపు ఇంజక్షన్) తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్ పద్మజ వెల్లడించారు. వెంటిలేటర్‌పై ప్రీతికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని పద్మజ తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు.. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి నరేందర్ ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. సీనియర్ పీజీ డాక్టర్ సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 354 కేసు నమోదు అయ్యింది. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా.. MBBS పూర్తి చేసిన ప్రీతి ఐదు నెలల క్రితమే వరంగల్‌ KMCలో PGలో చేరింది. డ్యూటీ విషయంలో తనకు ఎదురవుతున్న వేధింపులను ఎప్పటికప్పుడు తండ్రికి చెప్పినట్లు సమాచారం.

Preethi-Father.jpg

ప్రీతి తండ్రి ఏమంటున్నారు..?

ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ASIగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి. మంగళవారం రాత్రి చివరిసారి తమ్ముడు పృధ్వీతో ప్రీతి మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇలా తనకు తానుగా ఇంజక్షన్ తీసుకుంది. నవంబర్ నుంచి ప్రీతిని సీనియర్ విద్యార్తి వేధిస్తున్నాడు. ఇదే అంశంపై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కూడా ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం మాకు ఫోన్ కూడా చేయలేదు. ర్యాగింగ్‌ను ప్రీతి వ్యతిరేకించింది. తనకు తోటి విద్యార్థులు మద్దతు పలకాలని కోరింది. రెండు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి.. కాబట్టి తమను కూడా వేధిస్తారని తోటి విద్యార్థులు వెనుకడుగు వేశారు. అందుకే తోటి విద్యార్థులు సహకరించలేదు. ఇప్పుడు ప్రీతి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో ఐదు గంటలు గడిస్తే తప్ప ఆరోగ్యంపై చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై, అలాగే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని ప్రీతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-22T20:36:14+05:30 IST