అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-09-19T23:45:20+05:30 IST
అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీ్సస్టేషన్ పరిధి మడికట్టు గ్రామంలో మంగళవారం జరిగింది

చేవెళ్ల, సెప్టెంబరు 19 : అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీ్సస్టేషన్ పరిధి మడికట్టు గ్రామంలో మంగళవారం జరిగింది. చేవెళ్ల మండలం తంగడ్పల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం మడికట్టుకు చెందిన రావులపల్లి శ్రీకాంత్రెడ్డి(32) తన వ్యవసాయ పొలంలో కూరగాయలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. దీని పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే, అతడు చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక, ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక నిత్యం సతమతమయ్యేవాడు. ఈ యేడాది సాగు చేసిన క్యారెట్, టమాట పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన శ్రీకాంత్రెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలంలోనే పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.