ప్రారంభానికి విజయ మెగా డెయిరీ ప్లాంట్ సిద్ధం
ABN , First Publish Date - 2023-10-03T23:53:36+05:30 IST
రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడం, పాడి రైతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది.
రావిరాలలో రూ.250కోట్లతో నిర్మాణం పూర్తి
రేపు ప్రారంభోత్సవం
హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, తలసాని, సబిత,మహేందర్రెడ్డి
రోజుకు 5లక్షల నుంచి 8లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్ /మహేశ్వరం, అక్టోబరు 3): రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడం, పాడి రైతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. రాయితీపై పాడి పశువులను పంపిణీ, బ్యాంకు రుణాలు, డెయిరీలకు పాలు పొస్తున్న పశుపోషకులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తోంది. నాణ్యమైన పాలను సరఫరా చేసేలా విజయ మెగా డెయిరీ అందుబాటులోకి రానుంది. విజయ డెయిరీ మెగా ప్లాంట్ను ఈ నెల 5న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీనివా్సయావ్, సబితారెడ్డి, మహేందర్రెడ్డిలు హాజరుకానున్నారు. మహేశ్వరం మండలం రావిరాలలో 2021 సెప్టెంబర్ 3న మంత్రులు తలసాని శ్రీనివా్సయావ్, సబితారెడ్డి ఈ మెగా డెయిరీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అధునాతన టెక్నాలజీతో రూ.250కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 42ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. త్వరితగతిన నిర్మాణం చేసేందుకు మంత్రి సబితారెడ్డి కృషిచేశారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ది సంస్థ, డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా డెయిరీ ప్లాంట్ నిర్మించారు. 5లక్షల నుంచి 8లక్షల లీటర్ల పాల సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మించారు. ఈ మెగా డెయిరీలో మిల్క్ పైపు బ్రిడ్జి, సివిల్ పనులు, ల్యాబొరేటరీ, నెయ్యి శుద్ధి, వెన్న తయారీ, ఐస్క్రీం ప్యాకింగ్, ఐస్క్రీం మిక్స్ ప్రిపరేషన్, పెరుగు ప్యాకింగ్, శీతలీకరణ విభాగాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ డెవల్పమెంట్ బోర్డు(ఎన్డీడీబి) ఈ ప్లాంట్కు కన్సల్టెన్సీ సేవలందిస్తుండగా కచరా డిజైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాంకేతిక సహకారం అందిస్తోంది. నాణ్యమైన పాలను సరఫరా చేస్తూ, పాడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేది లక్ష్యమని విజయ డెయిరీ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. పాల ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ వరకు అంతా ఆన్లైన్ విధానంలో జరగనుందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ డెయిరీలకు ధీటుగా విజయ డెయిరీని తీర్చిదిద్దుతోంది.