‘ప్రజావాణి’లో పరిష్కారం కాని సమస్యలు
ABN , First Publish Date - 2023-02-13T23:24:53+05:30 IST
ప్రతీవారం అనేక మంది తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్కు వస్తున్నారు.
కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షణలు
బస్సుల కోసం ఇబ్బంది పడిన ప్రజలు
రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 13 : ప్రతీవారం అనేక మంది తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్కు వస్తున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్కు తమ గోడు వినిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే గంపడాశతో వస్తున్నా నిరాశే ఎదురవుతోంది. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నా అర్జీల్లో చాలావరకు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మొదట్లో ఫిర్యాదులు అధిక సంఖ్యలో రావడంతో మండల, డివిజన్స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ డివిజన్, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అక్కడ పరిష్కారం కానివి మాత్రమే కలెక్టరేట్కు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమం సస్సెస్ కాకపోవడతో మళ్లీ ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా నిర్వహిస్తున్నారు. అయితే.. నాలుగైదు సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా.. సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
అధికారుల కోసం ఎదురు చూపులు
సమస్యలు విన్నవించుకునేందుకు బహుదూరం నుంచి కలెక్టరేట్కు విచ్చేసిన ప్రజలు అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన ‘ప్రజావాణి’ 11-30 గంటలకు ప్రారంభమైంది. కానీ.. జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా.. ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ హాజరు కాలేదు. కలెక్టర్ హరీష్ వస్తాడని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. చిరవకు అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియకు తమ బాధను చెప్పుకున్నారు.
కలెక్టరేట్కు ఎలా వెళ్లేది?
కొంగరకలాన్లోని కొత్త కలెక్టరేట్కు వెళ్లేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలకు మెహిదీపట్నం ఒకే బస్సు ఉంటంతో.. జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఆ సమయానికి చేరుకోలేకపోతున్నారు. ఒక వేళ అష్టకష్టాలు పడి చేరుకున్నా.. తిరిగి వచ్చేందుకు కలెక్టరేట్ నుంచి బస్సు లేదు. సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజావాణికి రావాలంటే.. కొంతమంది కలిసి ప్రైవేట్ వాహనం మాట్లాడుకుని వస్తున్నారు. చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, షాద్నగర్, చౌదరగిగూడ, కేశంపేట, నందిగామ, కొత్తూరు, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి,మాడ్గుల, శంషాబాద్, రాజేంద్రగనర్, శేరిలింగంపల్లి వాసులు బస్సుల కోసం ఇబ్బంది పడుతున్నారు. అప్పా జంక్షన్ నుంచి రోజు నాలుగు ట్రిప్పులు కలెక్టరేట్కు బస్సులు నడపాలని ఆయా మండల ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్ కోసం మూడు సార్లు కలెక్టరేట్కు వచ్చా
సార్.. మా అమ్మానాన్న చనిపోయారు. నేను దివ్యాంగురాలిని. ప్రభుత్వం ఇచ్చే పింఛన్పై ఆధారపడి బతుకుతున్నా. 2019లో పెళ్లి అయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త తాగొచ్చి కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ప్రస్తుతం చెంపాపేట్లో కిరాయికి ఉంటున్నాను. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇప్పించాలని కోరుకుంటున్న. నా సమస్య చెప్పుకునేందుకు ఇప్పటికీ మూడుసార్లు కలెక్టరేట్కు వచ్చాను. కలెక్టర్ కలవలేదు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు నా గోడు చెప్పుకున్నాను. సమస్య పరిష్కరించాలి.
- కుర్వ చంద్రకళ, దివ్యాంగురాలు, చంపాపేట్
కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు
ఆలూరు-1లో సర్వేనెంబర్ 390/అ 39 గుంట భూమి ఉంది. పహాని, నకల్లో కరెక్ట్ ఉంది. ఖాతా నెంబరులో మాత్రం తప్పుపడింది. ఇంటి పేరు దామరగిద్ద జంగయ్య తండ్రి బాలయ్య ఉండగా... నాయుడు జంగయ్య అని పేరు తప్పుగా ధరణిలో వచ్చింది. ఇప్పటికీ 4 సార్లు కలెక్టరేట్ వెళ్లాను. చేవెళ్ల తహసీల్దారు వద్దకు లెక్కలేనన్ని సార్లు వెళ్లాను. తహసీల్దారు వద్దకు వెళ్తే కలెక్టరేట్కు వెళ్లమంటున్నారు. కలెక్టరేట్ పలుమార్లు వెళ్లినా నా సమస్య పరిష్కారం కాలేదు.
- జంగయ్య, ఆలూరు గ్రామం, చేవెళ్ల మండలం
మా సమస్య పరిష్కారం కావడం లేదు
మా తాత, ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి కబ్జాకు గురవుతుంది. మాకు న్యాయం చేయాలని బాలాపూర్ మండలం, దావుత్ ఖాన్గూడ వాసులు కోరారు. ప్రజావాణిలో అధికారుల ముందు తమ గోడును వినిపించారు. సర్వే నెంబర్ 2లో 40-16 ఎకరాల ప్రభుత్వ భూమిలో 1954 నుంచి సాగు కేసుకుంటున్న 300 కుటుం బాలకు న్యాయం చేయాల న్నారు. ధరణి పోర్టర్లో నిషేది జాబితా నుంచి తొలగించి సాగు చేసుకుంటున్న వారికి పాసు పుస్తకాలు ఇవ్వాలని బాధితులు కోరారు.
- దావుద్ఖాన్గూడ వాసులు