హత్య కేసులో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2023-03-05T00:30:31+05:30 IST
సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ శివారులోని మాచిరెడ్డిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన పొలంలో 2021 సెప్టెంబర్ 3న జరిగిన కూలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
కోహీర్ మార్చి 4: సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ శివారులోని మాచిరెడ్డిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన పొలంలో 2021 సెప్టెంబర్ 3న జరిగిన కూలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు జహీరాబాద్ సీఐ తోట భూపతి వెల్లడించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్కార్డు ఆధారంగా పోలీసులు అతడిని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన గిర్మా నారాయణగా గుర్తించారు. మృతుడి అన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు అప్పటి కోహీర్ ఎస్ఐ రాజశేఖర్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కోహీర్ మండలంలోని మనియర్పల్లి గ్రామానికి చెందిన గంజాయి రాజు ఈనెల 2న అదే గ్రామానికి చెందిన మచ్కురి వీరన్నతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తనకు గిర్మా సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, ఆమె భర్త నారాయణకు విషయం తెలిసి నిత్యం ఆమెను ఇబ్బంది పెట్టేవాడని తెలిపాడు. దీంతో విసుగు చెందిన గిర్మా సుజాత, తాను కలిసి పథకం పన్ని ఆమె భర్త నారాయణను హత్య చేసినట్లు వివరించాడు. ఈ విషయాన్ని వీరన్న అదేరోజు కోహీర్ ఎస్ఐ సురేష్కు చెప్పాడు. వీరన్న వాంగ్మూలం ఆధారంగా ఆ కేసును హత్య కేసు కింద పరిగణించి కేసును జహీరాబాద్ సీఐ తోట భూపతికి అప్పగించారు. ఈనెల 4న సీఐ తోట భూపతి మనియర్పల్లి గ్రామంలోని గంజాయి రాజు ఇంటికి వెళ్లి రాజును విచారించారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలంలోని తోర్మామిడి గ్రామం గిర్మా సుజాత తల్లిగారి ఊరని, అప్పట్లో ఆమెతో తనకు వివాహేతర సంబంధం ఉండేదని, ఆమె కోరిక మేరకే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న నారాయణను పథకం ప్రకారం పంట పొలంలోకి తీసుకెళ్లినట్లు చెప్పాడు. అనంతరం ముగ్గురు కలిసి మద్యం తాగామని, అదే సమయంలో హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. కేసులో ప్రధాన నిందితులైన మృతుడి భార్య సుజాత, గంజాయి రాజులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ వివరించారు.