పారదర్శకంగా ఓటరు జాబితా
ABN , First Publish Date - 2023-09-22T22:32:10+05:30 IST
ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ర్టోరల్ పరిశీలకులు విజయేంద్రబోయి అన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ర్టోరల్ పరిశీలకులు విజయేంద్రబోయి
వికారాబాద్, సెప్టెంబరు 22 : ఓటరు ముసాయిదా జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఎలక్ర్టోరల్ పరిశీలకులు విజయేంద్రబోయి అన్నారు. శుక్రవారం రాబోయే ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాల పరిశీలన, తదితర అంశాలపై కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్లతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో వంద శాతం ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. అత్యధికంగా ఓటరు నమోదు చేసిన జిల్లాగా, ఆదర్శంగా నిలవాలని రాజకీయ ప్రతినిధులకు సూచించారు. జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా యంత్రాంగం కృషి అభినందనీయమని ఈఆర్వో అన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారిగా 90 సంవత్సరాలు నిండిన ఓటర్లు, ట్రాన్స్ జెండర్ల ఓటర్ల వివరాలపై అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదులో భాగంగా విద్యార్థులతో రూపొందించిన లఘుచిత్రం, ఓటరు నమోదు ప్రక్రియపై చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫొటోల క్లిప్పింగ్లను తిలకించి ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతకుముందు పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మన్నెగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్నిఅధికారులతో కలిసి ఓటరు జాబితా ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవోలు విజయకుమారి, శ్రీనివాసరావు, డీటీడబ్ల్యూవో కోటాజీ, తహసీల్దార్లు, బీఎల్వోలు పాల్గొన్నారు.