అధికారుల కృషి అభినందనీయం: కలెక్టర్ నారాయణరెడ్డి
ABN , First Publish Date - 2023-06-02T23:29:36+05:30 IST
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
వికారాబాద్, జూన్ 2 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమవేశంలో మాట్లాడారు. 20 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను, మున్ముందు కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సమష్టి కృషితో నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని 99 రైతు వేదికలను అందంగా అలంకరించి పూర్తి బాధ్యత వ్యవసాయాధికారులు, గ్రామ కార్యదర్శులు చేపట్టాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా అందరూ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. గ్రామాల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా రైతులను రైతు వేదికలకు తరలించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్గగ్వార్, నారాయణ అమిత్లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.