స్తంభాలను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2023-02-21T00:38:58+05:30 IST
కారును డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి రెండు విద్యుత్ స్తంభాలను, చెట్టును ఢీకొన్న సంఘటన అలియాబాద్ సమీపంలో సోమవారం జరిగింది.
శామీర్పేట, ఫిబ్రవరి 20: కారును డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి రెండు విద్యుత్ స్తంభాలను, చెట్టును ఢీకొన్న సంఘటన అలియాబాద్ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగుపల్లికి చెందిన చిన్నపుల్ల బేదేలు మహీంద్రా ఎక్స్యూవీ కారులో నలుగురిని ఎక్కించుకొని సోమవారం సాయంత్రం చౌరస్తా నుంచి అలియాబాద్ వైపునకు వెళ్తున్నాడు. కారును వేగంగా, అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కనున్న రెండు హైవోల్జేజీ స్తంభాలను, చెట్టును ఢీకొట్టాడు. దీంతో విద్యుత్ పోళ్లు విరిగిపోయాయి. కారు నుజ్జునుజ్జుయింది. కారులోని ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు లక్షమ్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. కారుతో విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి ట్రాన్స్కోకు రూ.1లక్ష నష్టాన్ని కలిగించిన డ్రైవర్పై క్రిమినల్ చర్యలను తీసుకోవాలని అలియాబాద్ సెక్షన్ ఏఈ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.