ఆలయంలోని పురాతన సామగ్రి వెనక్కి
ABN , First Publish Date - 2023-03-25T23:32:01+05:30 IST
తాండూరు శ్రీభావిగి భద్రేశ్వర ఆలయానికి సంబంధించి వందేళ్ల చరిత్ర ఉన్న ఇత్తడి సామగ్రిని రూ.1లక్ష 10వేలకు ఉన్నతాధికారులకు తెలియకుండానే విక్రయించిన ఈవో విమర్శల నేపథ్యంలో అట్టి సామగ్రిని వెనక్కి తెచ్చారు.
ఉన్నతాధికారులకు తెలియకుండా విక్రయం
క్లీనింగ్కు ఇచ్చామని మాటమార్చిన ఈవో
తాండూరు, మార్చి 25: తాండూరు శ్రీభావిగి భద్రేశ్వర ఆలయానికి సంబంధించి వందేళ్ల చరిత్ర ఉన్న ఇత్తడి సామగ్రిని రూ.1లక్ష 10వేలకు ఉన్నతాధికారులకు తెలియకుండానే విక్రయించిన ఈవో పత్రికలో వచ్చిన కథనం, సమాజంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో అట్టి సామగ్రిని వెనక్కి తెచ్చారు. ఆ సామగ్రిని కేవలం క్లీన్ చేయడానికే పంపించామని, వదంతులను నమ్మవద్దని ఈవో తనను తాను సమర్థించుకున్నారు. శుక్రవారం మాత్రం అట్టి సామాన్లను కొంతమంది పెద్దల సమక్షంలోనే కొటేషన్ పద్ధతిన విక్రయించానని చెప్పిన ఈవో శేఖర్గౌడ్ శనివారం మాటమార్చారు. ఆంధ్రజ్యోతిలో శనివారం ‘ఆలయ పురాతన సామగ్రి విక్రయం’ అనే శీర్షికన వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ఇది కేవలం తాను పడనివ్యక్తులు, దుర్మార్గులు అమ్మినట్లు పత్రికల్లో రాయించుకున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ పురాతన వస్తువుల విక్రయ సమయంలో పెద్దలుగా వ్యవహరించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు జొన్నల బస్వరాజ్ కూడా పురాతన ఇత్తడి వస్తువులు ఒకేచోట నిల్వ వల్ల దుర్గంధం వెదజల్లుతోందని, వాటిని విక్రయించి ఆలయ ఇతర అవసరాలకు డబ్బులను వాడుకోవాలని నలుగురు సమక్షంలో నిర్ణయించినట్లు తెలిపారు. కొటేషన్ పద్ధతిలోనే విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఈవో మాటమార్చడంపై విమర్శలు వస్తున్నాయి. వస్తువుల విక్రయాలపై ఎండోమెంట్ ఉన్నతాధికారుల అనుమతులు కూడా లేవు.