ప్రజాపాలనకు విశేష స్పందన
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:10 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఇబ్రహీంపట్నం నియోజవర్గం అబ్దుల్లాపూర్మెట్ పంచాయతీలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు.
అబ్దుల్లాపూర్మెట్లో ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
మొదటి రోజు 49,110 దరఖాస్తులు
కేంద్రాలను పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీ్పకుమార్ సుల్తానియా, కలెక్టర్ గౌతమ్ పోట్రు
రంగారెడ్డి అర్బన్/శంషాబాద్ రూరల్, డిసెంబరు 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఇబ్రహీంపట్నం నియోజవర్గం అబ్దుల్లాపూర్మెట్ పంచాయతీలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీ్పకుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలు, 16 మున్సిపాలిటీల్లో ప్రజాపాలన సభలు జరిగాయి. పల్లెలు, వార్డుల్లో గ్రామ సభలను నిర్వహించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు బారులు తీరారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తోపులాటలకు ఆస్కారం లేకుండా మహిళలు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఆరు గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దరఖాస్తులను సమర్పించారు. మొదటి రోజు జిల్లాలో 49,110 దరఖాస్తులు స్వీకరించగా అందులో పంచాయతీల్లో 16,042 దరఖాస్తులు, మున్సిపల్ వార్డుల్లో 33,068 దరఖాస్తులు స్వీకరించారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించిన కలెక్టర్ కౌంటర్ల విషయం గురించి కమిషనర్ భోగేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శంషాబాద్ మండలంలోని నర్కూడ ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించి దరఖాస్తులను జాగ్రత్తగా ఎంపీడీఓ కార్యాలయానికి తరలించాలని చెప్పారు.