సాత్విక్ ఆత్మహత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2023-03-05T23:51:06+05:30 IST
అధ్యాపకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్యలు కోరారు.
షాద్నగర్, మార్చి 5 : అధ్యాపకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్యలు కోరారు. ఈమేరకు ఆదివారం సాత్విక్ తల్లితండ్రులను వారి నివాసంలో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధ్యాపకుల వేధింపులు భరించలేక సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని, వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయమన్నారు. ఈవిషయానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఓ కమిటీ వేసి బోగస్ రిపోర్ట్ను రూపొందించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గతంలో కార్పొరేట్ కళాశాలలకు సంబంధించి వేసిన కమిటీలు వాటి నిర్వాహణ తీరు బాగాలేదని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్పొరేట్ కళాశాలలను మూసివేస్తామని చెప్పిన కేసీఆర్ నేడు కార్పొరేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.