దశలవారీగా అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2023-08-12T23:37:13+05:30 IST

దశలవారీగా పరిగి మునిసిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బస్తీబాటలో భాగంగా శనివారం ఒకటో వార్డు మల్లెమోనిగూడలో పర్యటించారు.

దశలవారీగా అభివృద్ధికి చర్యలు
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి, ఆగస్టు 12: దశలవారీగా పరిగి మునిసిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బస్తీబాటలో భాగంగా శనివారం ఒకటో వార్డు మల్లెమోనిగూడలో పర్యటించారు. సీసీ, మురుగు కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీబాటలో గర్తించిన ప్రతీ సమస్యను రెండు నెల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మునిసిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. మునిసిపల్‌కు కొత్తగా రూ.25కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎక్కువ సమస్యలు ఉన్నచోట ఎక్కువగా ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, స్ర్టీట్‌ లైట్ల ఏర్పాటు కోసం నిధులు ఎక్కువ వెచ్చిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అవసరం ఉన్నచోట కొత్తగా బోర్లు, ఓహెచ్‌ఎ్‌సఆర్‌లు నిర్మిస్తామని తెలిపారు. పరిగిని జిల్లాలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతామ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, కౌన్సిలర్‌ వాసియాతబస్సుమ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆర్‌.అంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మౌలనా పాల్గొన్నారు.

చిట్యాల్‌లో పంచాయతీ భవనం ప్రారంభం

నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిట్యాల్‌లో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రార ంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్న గ్రామాలు, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ అరవింద్‌రావు, సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీ వెంకటేశ్‌, నాయకులు ఎం.రాజేందర్‌, బి.ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

‘గ్రామాల అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు’

కులకచర్ల: రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారు అని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కామున్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తరువాత చిన్న తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతీ గ్రామానికి నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో కొత్త హంగులతో పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వారిని నమ్మరని, వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్ఛంద్ర, సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ చందన, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరికృష్ణ, వైస్‌ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, రైతు సమితి కో-ఆర్డినేటర్‌ రాజు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు శేరి రాంరెడ్డి, లక్ష్మయ్య, రాజప్ప, కృష్ణయ్యగౌడ్‌, కార్యదర్శి విజయ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-12T23:37:13+05:30 IST