మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి
ABN , First Publish Date - 2023-03-25T22:56:33+05:30 IST
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ అన్నారు.
విద్యార్థినులకు అవగాహన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై
శంకర్పల్లి, మార్చి 25: మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ అన్నారు. శనివారం శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులో గల ఐబీఎస్ కాలేజీలో రెండు రోజుల పాటు నిర్వహించే ‘మహిళా సఖ్యత, సంఘర్షణలు, సంక్లిష్టతలు’ అనే అంశంపై సెమినార్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళి సై మాట్లాడుతూ.. సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఏ సమస్యొచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గతంలో ఇంటికే పరితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శక్తిగా మారారని కొనియాడారు. మహిళలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డెలీనా క్యాండప్, వైస్చాన్స్లర్ గణేష్, ప్రొఫెసర్లు నర్సింహారావు, రేఖ, రాజ్ జైన్, విద్యార్థులు పాల్గొన్నారు.