నా తొలి జీతం పెన్షనర్ల సంక్షేమానికే...
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:20 PM
ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పెన్షనర్ల(రిటైర్డు ఉద్యోగుల) సంక్షేమానికి అందజేస్తానని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, డిసెంబరు 17(ఆంరఽధజ్యోతి): ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పెన్షనర్ల(రిటైర్డు ఉద్యోగుల) సంక్షేమానికి అందజేస్తానని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రతీ నెల 1వ తేదీనే రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. 41వ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం షాద్నగర్లోని పెన్షనర్స్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు చెల్లించకుండా వారిని తీవ్ర మానిసిక క్షోభకు గురి చేశారన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కవులు, కళాకారులు, ఉద్యోగులను మోసం చేసి పదేళ్లు పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దితే మరి ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకొని ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అనుభవం ఉన్న పెన్షనర్లు కూడా ప్రజలకు మంచి పాలన అందించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం నాయకులు రామారావు, గంగిరెడ్డి, సరాపు జగదీష్, జనార్ధన్, సురేష్ పాల్గొన్నారు.