రూ.3కోట్లతో చేవెళ్ల బస్టాండ్‌ ఆధునికీకరణ

ABN , First Publish Date - 2023-03-30T23:39:48+05:30 IST

చేవెళ్ల ఆర్టీసీ బస్టాండ్‌ను రూ.3కోట్లతో మోడ్రన్‌గా నిర్మించబోతున్నట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బస్‌స్టాండ్‌తో పాటు మినీ స్టేడియం పనులు పరిశీలించారు.

రూ.3కోట్లతో చేవెళ్ల బస్టాండ్‌ ఆధునికీకరణ
చేవెళ్ల బస్‌స్టాండ్‌లో పనులు పరిశీలిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

త్వరలో ఉపయోగంలోకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం

సొంత డబ్బులతో మినీ స్టేడియం అభివృద్ధి

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

చేవెళ్ల, మార్చి 30 : చేవెళ్ల ఆర్టీసీ బస్టాండ్‌ను రూ.3కోట్లతో మోడ్రన్‌గా నిర్మించబోతున్నట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బస్‌స్టాండ్‌తో పాటు మినీ స్టేడియం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీర్‌ అధికారులతో పనులు వేగవంతంగా చేయాలని సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ 2.5 ఎకరాల్లో ఉన్న చేవెళ్ల బస్టాండ్‌ను రూ.3 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఇస్తున్నట్లు చెప్పారు. భవనం వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతోపాటు తన సొంత డబ్బులు రూ. 35 లక్షల నుంచి రూ.50 లక్షల వ్యయంతో చేవెళ్ల మినీ స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌తోపాటు వాలీబాల్‌, కబడ్డీ క్రీడాకారుల కోసం వసతుల కల్పనకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా తన పార్లమెంట్‌ పరిధిలో కార్యకర్తలే నా బలగం అని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌కు ఇటీవల గుండెకు స్టంట్‌ వేశారు. విషయం తెలుసుకొని రామన్నగూడలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్లు బి.నర్సింహులు, మాణిక్యరెడ్డి, గిరిధర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు కృష్ణ, మహేశ్‌, మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మోసిన్‌, జి. రవికాంత్‌రెడ్డి, రవీందర్‌, మాణిక్యం, రాములు, దయాకర్‌, ఘనీ, రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-03-30T23:39:48+05:30 IST