మనఊరు - మనబడి పనులు త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2023-02-25T22:46:28+05:30 IST
మనఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
సమీక్షలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్
పనుల ఆలస్యంపై కలెక్టర్ అసహనం
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 25: మనఊరు - మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో మనఊరు -మనబడిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మార్చికల్లా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని 176 పాఠశాలల్లో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యంవల్లే పనులు నత్తనడకన జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఇప్పటికైనా తీరుమార్చుకుని ఫేజ్-1 పనులను తొందరగా పూర్తిచేసేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. మనఊరు-మనబడి పనులపై ప్రతి శనివారం సమీక్ష జరుగుతుందని, ప్రతి పనిలో పురోగతి కనిపించాలని చెప్పారు.
జీవో 59 దరఖాస్తులను పరిశీలించాలి
ప్రభుత్వ నిబంధనల మేరకు జీవో 59 దరఖాస్తులను పరిశీలించి త్వరగా క్లియర్ చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జీవో 59, డబుల్ బెడ్రూం ఇండ్లపై తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. అర్హులకు జీవో 59 కింద క్రమబద్ధీకరించేందుకు మూడు విడతల్లో డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఒకేసారి మొత్తం డబ్బులు చెలించేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈఅవకాశాన్ని అబ్ధిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు అందించిన వారి వివరాలు పోర్టల్లో నమోదు చేయాలని, ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, డీఈవో విజయకుమారి, పీఆర్ఈఈ రామ్మోహన్రావు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.