లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2023-02-06T23:53:49+05:30 IST
మండలంలోని బైపాస్ రహదారిలో పెంజర్ల చౌరస్తా వద్ద సోమవారం ఉదయం గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
న్యాయం చేయాలని కుటుంబసభ్యుల రాస్తారోకో
కొత్తూర్, ఫిబ్రవరి 6: మండలంలోని బైపాస్ రహదారిలో పెంజర్ల చౌరస్తా వద్ద సోమవారం ఉదయం గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం రంగాపూర్కు చెందిన తోట శ్రీనివాస్(50) పెంజర్ల రహదారిలోని గ్రీన్హోం రియల్వెంచర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శ్రీనివాస్ స్వగ్రామం నుంచి ఆటోలో కొత్తూర్కు వచ్చి పెంజర్ల చౌరస్తా వద్ద దిగి కాలినడకన రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి షాద్నగర్ వైపు వస్తున్న లారీ శ్రీనివా్సను ఢీకొని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ లారీని నిలపకుండానే పరారయ్యాడు. మృతుడి కుమారుడు తోట రఘు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. కాగా, ఘటనాస్థలంలో మృతుడి కుటుంబసభ్యులతో పాటు రంగాపూర్ గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీఐ బాలరాజ్, ఎస్ఐ శంకర్లు ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి న్యాయం చేస్తామని హామీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని షాద్నగర్ ఎసీపీ కుషాల్కర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివా్సనాయుడు, షాద్నగర్ ట్రాఫిక్ సీఐ శ్రీశైలం, నందిగామ సీఐ రామయ్యలు పరిశీలించారు.