‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-20T23:53:01+05:30 IST

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా అందించే వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి అన్నారు.

‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
వికారాబాద్‌ : కంటి వెలుగు శిబిరంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌/పరిగి/కులకచర్ల/ఘట్‌కేసర్‌/కీసర రూరల్‌/మేడ్చల్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జనవరి 20 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా అందించే వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌ తనిఖీ చేశారు. మెడికల్‌ క్యాంపు నిర్వహణ ఎలా ఉందనే విషయమై వైద్యసిబ్బంది, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న వికారాబాద్‌ పట్టణంలోని గౌలీకర్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళా వాల్‌ పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు. అదేవిధంగా కంటివెలుగు అద్భుతమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మండలం చిట్యాల్‌ గ్రామంలో నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొని, కంటి పరీక్షల అనంతరం ప్రజలకు అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, మండల వైద్యాధికారి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌ బి.రజిత, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ బి.ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులకచర్ల మండల పరిధిలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా మానిటరింగ్‌ అఽధికారి, కంటి వెలుగు ఇన్‌చార్జి చంద్రప్రకాశ్‌ తెలిపారు. కులకచర్ల, బండవెల్కిచర్ల, అంతారం గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మాధురి, మహేశ్వరి, సురేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ ముల్లి పావనీ జంగయ్యయాదవ్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌ కమ్యునిటీ హాల్‌లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు విచ్చేసే వారికి సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, ఒకటో వార్డు కౌన్సిలర్‌ చందుపట్ల వెంకట్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌, వైద్యులు ఫణీందర్‌రెడ్డి, విమల, శిరీష, సిబ్బంది రాజేశ్వరి, విజయ, సాత్విక్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా, మేడ్చల్‌ మండలంతో పాటు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నాలుగు కంటివెలుగు శిబిరాల్లో శుక్రవారం స్థానిక ప్రజలు పెద్దఎత్తున కంటి పరీక్షలు చేసుకున్నారు. మేడ్చల్‌ మున్సిపాలిటీ ముకుంద్‌ ఫంక్షన్‌ హాలులో, గుండ్లపోచంపల్లి సుతారి గూడలో, రాజబొల్లారం, శ్రీరంగవరం గ్రామాల్లో ఏర్పాటుచేసిన శిబిరాలకు స్థానికులు చేరుకుని కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి చూపు సమస్యను కంటి వెలుగు కార్యక్రమంతో పరిష్కరించుకోవాలని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. అక్కడి సదుపాయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సరిత, నాయకులు అన్నంరాజ్‌ శ్రీనివాస్‌, నిమ్మల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T23:53:02+05:30 IST