నవమి ఉత్సవాలకు మైసిగండి రామాలయం ముస్తాబు

ABN , First Publish Date - 2023-03-25T22:52:02+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కడ్తాల మండలం మైసిగండి రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రభుత్వ లాంఛనాలతో మైసిగండి రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.

నవమి ఉత్సవాలకు మైసిగండి రామాలయం ముస్తాబు
మైసిగండి రామాలయం

29 నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు

కడ్తాల్‌, మార్చి25: ప్రముఖ పుణ్యక్షేత్రం కడ్తాల మండలం మైసిగండి రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రభుత్వ లాంఛనాలతో మైసిగండి రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. అక్కన్న, మాదన్నల కాలం నాటి మైసిగండి శివ, రామాలయానికి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుంది. హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి భక్తుల తాకిడీ ఎక్కువే! ప్రస్తుతం ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలి పంతూ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహి స్తున్నారు. ఆలయంలోని శిల్పకళ చూపరులను కట్టిపడేస్తోంది. కోనేటి నీరు పవిత్రమైందని, దీనిలో స్నానాలాచరిస్తే పాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ మధ్యనే రూ.కోటితో కోనేటిని ఆధునికీకరించారు. బ్రహ్మోత్సవాలకు నిర్వాహకులు, ఎండోమెంట్‌ అధికారులు వసతులు కల్పిస్తున్నారు. చలువ పందిళ్లు వేసి తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నవమి కల్యాణోత్సవానికి ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను సమర్పించనుంది.

Updated Date - 2023-03-25T22:53:06+05:30 IST