పాడి, పంటల నిలయం కొడంగల్!
ABN , First Publish Date - 2023-10-31T23:13:55+05:30 IST
తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కొడంగల్లో పరిశ్రమలు, ఇతరత్రా అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి జనం వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నియోజకవర్గంలో గతంతో పోల్చితే స్థానికంగానే గురునాథ్రెడ్డి(గడీలు), గుడి పక్కన ఉన్న నందారం వెంకటయ్య మధ్యనే తీవ్ర పోటీ నెలకొనేది. ప్రస్తుతం స్థానికేతరులు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు.
పంటల సాగుకు వర్షాలే ఆధారం
దశాబ్ధాల ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీదే ఆఽధిక్యం
1967లో మంత్రిగా అచ్యుతారెడ్డి
ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థాయికే పరిమితమైన శాసనసభ్యులు
కొడంగల్లో ప్రధానంగా గడి, గుడి మధ్యనే పోటీ
తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కొడంగల్లో పరిశ్రమలు, ఇతరత్రా అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి జనం వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నియోజకవర్గంలో గతంతో పోల్చితే స్థానికంగానే గురునాథ్రెడ్డి(గడీలు), గుడి పక్కన ఉన్న నందారం వెంకటయ్య మధ్యనే తీవ్ర పోటీ నెలకొనేది. ప్రస్తుతం స్థానికేతరులు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు.
కొడంగల్, అక్టోబరు 31 : 1952లో ఏర్పడిన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడుసార్లు కాంగ్రెస్ గెలవగా, ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి బీఆర్ఎస్ గెలుపొందాయి. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో 12 పర్యాయాలు గడి, గుడి మధ్యనే రసవత్తర పోటీ నెలకొంది. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా 1967లో జరిగిన ఎన్నికల్లో అచ్యుతారెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఎవరికీ రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు దక్కలేదు. గుడిగా పేరొందిన దివంగత నందారం వెంకటయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదవిలో ఉండగానే ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణ టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. గడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే ఆర్.గురునాథ్రెడ్డి ఇక్కడ నుంచి ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం నందారం సూర్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ధీటైన అభ్యర్థులు లేకపోవడంతో అప్పట్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్రెడ్డిపై గెలుపొందారు. అప్పటి నుంచి కొడంగల్లో రాజకీయాలు మారిపోయాయి. అప్పటి నుంచి రేవంత్రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి కొనసాగుతూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దివంగత మాజీ ఎంపీ విఠల్రావుకు అవకాశం దక్కింది. దీంతో గురునాథ్రెడ్డి కొన్ని రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా త్రిముఖ పోటీలో రేవంత్రెడ్డి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రస్తుత మంత్రి పట్నం మహేందర్రెడ్డి సోదరుడు పట్నం నరేందర్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి మద్దతు తెలపడంతో నరేందర్రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కింది. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంపై ఫోకస్ చేసి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన రేవంత్రెడ్డిని ఓడించారు. కొడంగల్లో ఓటమిపాలైన రేవంత్రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో నిలిచి ఎంపీగా గెలిచి టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి పోటీ చేయనుండడంతో కొడంగల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గెలుపు నకు కృషి చేసినా తనకు సముచిత స్థానం కల్పించలేదని బీఆర్ఎస్ను వీడి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో గురునాథ్రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్లో చేరడం రేవంత్రెడ్డికి కలిసి రానుంది. అయితే ఈ ఎత్తుగడను చిత్తు చేసేందుకు మంత్రి మహేందర్రెడ్డి కొడంగల్లో తన సోదరుడు పట్నం నరేందర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం కొడంగల్లో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. కొడంగల్ అంటే గుడి, గడి మధ్యనే పోటీ ఉండగా, ప్రస్తుతం కొడంగల్ అంటే రేవంత్రెడ్డి అనే స్థాయికి ప్రచారం జోరందుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్గా పేరొందిన రేవంత్రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగి తనకు ఎదురులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈసారి విజయం కోసం రేవంత్ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండగా, అసెంబ్లీలో ఆయనను అడుగుపెట్టనివ్వమనే ప్రచారంతో పట్నం నరేందర్రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. 1952లో కొడంగల్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు నువ్వా నేనా అనే విధంగా తలపడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గడి, గుడి నేతలు కాంగ్రె్సలో చేరడంతో ఈసారి రేవంత్రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
25 ఏళ్లు ఎమ్మెల్యేగా గురునాథ్రెడ్డి రికార్డు
ఇటీవల తిరిగి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి ఐదుసార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగి ఎదురులేని నేతగా ఎదిగారు. మొదటగా కొడంగల్ పంచాయతీ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గురునాథ్రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు.. 2009, 2014 ఎన్నికల్లో రేవంత్రెడ్డి టీడీపీనుంచి గెలుపొందగా.. 2018లో నరేందర్రెడ్డి రేవంత్పై గెలుపొందారు.
కర్ణాటక సంప్రదాయాలకు నిలయం
కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో ప్రజలు జీవనాధారంగా పంటలను సాగు చేస్తారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఆ రాష్ట్ర సంప్రదాయాలకు నిలయంగా ఉన్నారు. కొడంగల్ గతంలో కర్ణాటక రాష్ట్రం గుల్మర్గ జిల్లాలో కొనసాగేది. కాలక్రమేణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీలినమైంది. అప్పట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో గల కొడంగల్ ప్రాంతం 6 మండలాలతో కొడంగల్, కోస్గి, బొంరాస్పేట్, మద్దూర్, దౌల్తాబాద్, దామరగిద్దతో కలుపుకొని తాలూకాగా ఉండేది. రానురాను కొడంగల్ నియోజకవర్గం నుంచి దామరగిద్ద నారాయణపేట్లో విలీనం అయింది. ఇప్పుడు 5 మండలాలతో నియోజకవర్గం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాన్ని రెండుగా చీల్చి వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో కలిపారు. కోస్గి, మద్దూర్ మండలాలు నారాయణపేట్ జిల్లాలో విలీనం కాగా కొడంగల్, బొంరా్సపేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇటీవల నూతన మండలాల ఏర్పాటులో భాగంగా నియోజకవర్గంలో మూడు నూతన మండలాలు ఏర్పడ్డాయి. అందులో వికారాబాద్ జిల్లాలో దుద్యాల, నారాయణపేట్ జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్ మండలాలుగా ఏర్పడగా ప్రస్తుతం 8 మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేకతలు
నియోజకవర్గ కేంద్రం కొడంగల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా శ్రీ వేంకటేశ్వరస్వామి పురాతన దేవాలయం భక్తుల ఇలవేల్పుగా పేరొందింది.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిత్య పూజలతో ప్రతీ ఏడాది బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో మినీ మేడారం జాతరగా పేరొందిన కోస్గి మండల పరిధిలో గల పోలెపల్లి ఎల్లమ్మ దేవత ఉత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి.
కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంత ప్రజలు కర్ణాటక సంప్రదాయాలను కొనసాగిస్తుంటారు.
అత్యధికంగా నియోజకవర్గ పరిధిలో చెరువులు కాకరవాణి, బొంరా్సపేట్ పెద్ద చెరువు, హస్నాబాద్ పెద్ద చెరువు, దౌల్తాబాద్ పెద్ద చెరువులతో పంట పొలాలు కళకళలాడుతుంటాయి.