కాంగ్రె్సకు ఓటేస్తే ఆగమైతం
ABN , First Publish Date - 2023-11-20T00:17:34+05:30 IST
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చబడుతోందని, ఏళ్ల తరబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాన్చిన కాంగ్రె్సకు ఓటు వేస్తే మళ్లీ మన బతుకులు ఆగమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

కల్వకుర్తి/ఆమనగల్లు, నవంబరు 19: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు పచ్చబడుతోందని, ఏళ్ల తరబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాన్చిన కాంగ్రె్సకు ఓటు వేస్తే మళ్లీ మన బతుకులు ఆగమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం సిద్ధించాకే పెండింగ్ ప్రాజెక్టుల్లో వాటిల్లో కదలిక వచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి మహబూబ్నగర్, మరో ఏడు జిల్లాలు బంగారు తునకగా మారనున్నాయని పేర్కొన్నారు. తాను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన అంశాన్ని గుర్తుచేశారు. జిల్లాలో రెండు జీవనదులున్నా అప్పట్లో ఎడారిగా మారడం వెనుక కాంగ్రెస్ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకుండా 30ఏళ్లు కోత పెట్టిన కాంగ్రె్సకు జిల్లా బాగోగుల గురించి ప్రశ్నించే అధికారం ఉందా? అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వలసలు ఆగాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు.. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి చావులు, ఎన్కౌంటర్లకు ప్రసిద్ధి అని, అలాంటి రాజ్యం తేస్తారా? అని ప్రశ్నించారు.
90వేల ఎకరాలకు నీరు : జైపాల్యాదవ్
కల్వకుర్తి సభలో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. రూ.850కోట్లతో కేఎల్ఐ ద్వారా 90వేల ఎకరాలకు నీరందించామన్నారు. కల్వకుర్తికి వంద పడకలు, ఆమనగల్కు 50పడకల ఆస్పత్రిని మంజూరు చేశారని తెలిపారు. ఆమనగల్కు ఆర్డీవో, ఏసీపీ, సబ్రిజిస్ర్టార్, ఎంవీఐ ఆఫీసులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎంను జైపాల్ కోరారు.