నేనే ఎంపీ.. ఆనందే ఎమ్మెల్యే!
ABN , First Publish Date - 2023-03-02T23:06:05+05:30 IST
వచ్చే ఎన్నికల్లోనూ మన ఎమ్మెల్యే మళ్లీ మెతుకు ఆనందేనని, ఎంపీ కూడా మళ్లీ నేనేనని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
డౌటే లేదు.. అనుమానముంటే కేసీఆర్తో ఫోన్ చేయిస్తా
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రంజిత్రెడ్డి
బంట్వారం, మార్చి 2: వచ్చే ఎన్నికల్లోనూ మన ఎమ్మెల్యే మళ్లీ మెతుకు ఆనందేనని, ఎంపీ కూడా మళ్లీ నేనేనని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. బంట్వారంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. ‘‘వికారాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆనంద్కే వస్తుంది.. తప్పకుండా ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఎవరికైనా అనుమానం ఉంటే కేసీఆర్తో ఫోన్ చేయిస్తా.. నేను కూడా ఎంపీగా మరోసారి గెలుస్తా. మళ్లీ ఎంపీ టికెట్ నాకే.’’ అంటూ ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ కార్యకర్తలతో అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనంద్కు టికెట్ రాదని కొందరు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధం అన్నారు. ఆనంద్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పథకాలను, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా శ్రేణులకు సూచించారు. వికారాబాద్ బ్రిడ్జి మరమ్మతులకు నిధులు కేటాయిస్తే.. కొందరు కేసులు వేసి పనులు చేయనీయడం లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం సరి కాదన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నామని, మన్నెగూడ-అప్పా జంక్షన్కు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు అవుతుందన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ఎవరైనా బీఆర్ఎ్సపై, తనపై విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవద్దని, అది మనకే మంచిదవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆనంద్ అన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రాంచందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, నర్సిములు, బల్వంత్రెడ్డి, నర్సిములు, నాయకులు సుధాకర్గౌడ్, ఖజాపాషా, బల్వంత్రెడ్డి, శివకుమార్, శరణారెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.