సుగంధ పంటల సాగుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Dec 16 , 2023 | 11:57 PM
పండించిన పంటలను ప్రపంచ మార్కెట్లో విక్రయించుకోవడానికి ఆహార ఉత్పత్తి సంఘాలు విస్తరించాలని హైదరబాద్ డివిజన్ సుగంధ ద్రవ్య బోర్డు సంచాలకులు శివకుమార్ అన్నారు.
సుగంధ ద్రవ్య బోర్డు సంచాలకులు శివకుమార్
పరిగి,డిసెంబరు 16: పండించిన పంటలను ప్రపంచ మార్కెట్లో విక్రయించుకోవడానికి ఆహార ఉత్పత్తి సంఘాలు విస్తరించాలని హైదరబాద్ డివిజన్ సుగంధ ద్రవ్య బోర్డు సంచాలకులు శివకుమార్ అన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ, సుగంధ ద్రవ్యబోర్డు ఆధ్వర్యంలో శనివారం పరిగి మండలం నస్కల్ గ్కామ రైతు వేదికలో సుగంధ ద్రవ్యాల సాగుపై ఔత్సాహిక రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఎఫ్పీవో రిజిస్ట్రేషన్ అపేడాలో సర్టిఫికేషన్ చేయడం ద్వారా యూరోప్, యూఎస్ మార్కెట్లో సుగంధ ద్రవ్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి అస్కారం ఉందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పసుపు,ఽ దనియాలు, పుదీనా, కొత్తిమీరపొడి, వాము, చింత ఉత్పత్తులు ఇతర దేశాల్లో అమ్ము కోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి కూడా వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి, దిగుబడి కంటే నాణ్యత ముఖ్యమని చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో పండించిన సుగంధ ద్రవ్య పంటల ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. జిల్లాలో పండిస్తున్న పసుపు యూఎ్సఏలో కూడా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ, ఉద్యాన పంటలకు జిల్లాలోని నేలలు అనువుగా ఉంటాయని తెలిపారు. జిల్లాలోని మామిడి రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి ఏడీఏ లక్ష్మీకుమారి, ఏవో ప్రభాకర్రెడ్డి, పరిగి క్లస్టర్ ఉద్యానశాఖ అధికారిణి వై.వైజయంతి, రైతుబంధుమండల కో-ఆర్డినేటర్ ఎం.రాజేందర్; ఏఈవోలు కల్యాణ్, కమల, గఫార్, ఎం.అర్చన తదితరులు పాల్గొన్నారు.