ఆమనగల్లు ఆసుపత్రిని 50 పడకలకు పెంచండి
ABN , First Publish Date - 2023-07-21T00:59:16+05:30 IST
ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలకు పెంచి నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కోరారు.
మంత్రి హరీశ్ రావుకు ఎమ్మెల్యే జైపాల్ వినతి
ఆమనగల్లు, జూలై 20 : ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలకు పెంచి నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కోరారు. ఈమేరకు గురువారం సచివాలయంలో బీఆర్ఎస్ ఆమనగల్లు మండలాధ్యక్షుడు అర్జున్రావుతో కలిసి మంత్రికి నగరంలో వినతిపత్రం అందజేశారు. ఆమనగల్లు సీహెచ్సీలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, వైద్య పరికరాలను అందజేయాలని, రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా కేఎల్ఐ డీ-82 కాల్వ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన రూ.16.50కోట్లు కలెక్టర్ పీడీ ఖాతాలో నుంచి వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని, తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లిలో ఏదేని ఒక బ్యాంక్ శాఖను ఏర్పాటు చేయాలని, వెల్దండ ఆసుపత్రి భవన నిర్మాణానికి అదనంగా రూ.50 లక్షలు కేటాయించాలని, కడ్తాల నుంచి చల్లంపల్లి మీదుగా పడకల్ గేటు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసిన రూ.20 కోట్లు వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావును కోరినట్లు జైపాల్యాదవ్ తెలిపారు. దీంతో సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి నూతన భవన నిర్మాణానికి రూ.17.50 కోట్లు కేటాయించినందుకు హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపినట్లు జైపాల్ యాదవ్ తెలిపారు. మంత్రిని కలిసినవారిలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, తదితరులు ఉన్నారు.