చేపల పండగకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-06-07T23:48:15+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చేపల పండగకు సర్వం సిద్ధం

సరూర్‌నగర్‌ స్టేడియంలో ‘ఫిష్‌ఫుడ్‌ ఫెస్టివల్‌’

మృగశిర కార్తెలో మూడు రోజులపాటు నిర్వహణ

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 7 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్‌ 8 నుంచి 10 వరకు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ జరపనున్నారు. 20 వరకు ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేసి నోరూరించే చేపల వంటకాలు, సాంప్రదాయక రుచులు, సీఫుడ్‌, ఎండు చేపలు, రెడీటూ ఈట్‌ ఫిష్‌ అందుబాటులో ఉంచనున్నారు. ఫుడ్‌ ఫెస్టివల్‌లో మహిళా సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేయించనున్నారు. అలాగే ఎవరైనా ప్రైవేట్‌ వ్యక్తులు ఫెస్టివల్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు గాను ఔత్సాహికులు జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి

దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తెను పురస్కరించుకుని ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాము. సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 8, 9,10 తేదీల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నాం. వంటల్లో అనుభవం ఉన్న, శిక్షణ పొందిన వారు ఈ వేడుకలో పాల్గొంటారు. ఆసక్తిగలవారు ఎవరైనా ఈ ఫెస్ట్‌లో పాల్గొనవచ్చు. జిల్లాలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

- సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి

Updated Date - 2023-06-07T23:48:15+05:30 IST