ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి
ABN , First Publish Date - 2023-06-02T23:56:40+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన ఉద్యమకారులకు అన్నింటా ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు.
వికారాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన ఉద్యమకారులకు అన్నింటా ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక బసంత్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ఉద్యమ జిల్లా నేత, వీడీడీఎఫ్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఆకాంక్షల సాధననే కాకుండా వెనకబడిన వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి ముందుకు సాగుదామన్నారు. అంతకుముందు ఇటీవల అకాల మరణం చెందిన వికారాబాద్ నియోజకవర్గ టీజేఏసీ కన్వీనర్ రామరావు జోషికి, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమంలో పనిచేసిన జిల్లాలోని జర్నలిస్టులు, న్యాయవాదులు, అధ్యాపకులు, ఉద్యమకారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ విజయకుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత కోకట్ మాధవరెడ్డి, వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రతినిధులు ఎర్రవల్లి జాఫర్, తస్వర్ అలీ, తిరుపతిరెడ్డి, అంజిరెడ్డి, వెంకటరత్నం, కేపీ రాజు, వివేకానందరెడ్డి, ఎం.సురేష్, జొన్నల రవిశంకర్ పాల్గొన్నారు.