నేడు నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ

ABN , First Publish Date - 2023-08-02T22:54:18+05:30 IST

జిల్లా వ్యాప్తంగా నేడు నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

నేడు నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ

8.66లక్షల మందికి మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

జిల్లా వ్యాప్తంగా నేడు నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. గత నెల 20వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నులిపురుగు నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్ల వయసులోపు గల వారందరికీ ఈ మాత్రలు (ఆల్‌బెండజోల్‌) వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8.66లక్షల మంది పిల్లలను గుర్తించారు. జిల్లాలోని 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పర్యవేక్షణలో ఏఎన్‌ఎమ్‌లు, ఆరోగ్య సూపర్‌వైజర్లు, ఆశాలు, ఆంగన్‌వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముందుగా గుర్తించిన పిల్లందరికీ గురువారం మాత్రలు వేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు జిల్లా వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏదైనా ప్రతికూల ప్రభావం, స్వల్ప అనారోగ్య సంఘటనలు జరిగితే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. తగినన్ని ఆల్బెండజోల్‌ మాత్రలు అందుబాటులో ఉంచామని చెప్పారు. నులిపురుగు నిర్మూలన కార్యక్రమ పర్యవేక్షణకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగామ్‌ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. జిల్లా టీకాల అధికారి స్వర్ణకుమారి ఆధ్వర్యంలో జూనియర్‌ కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జ్వరం, కండ్లకలక, ఇతర అనారోగ్య లక్షణాలున్న పిల్లలకు ఈ నెల 10వ తేదీన మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు.

కండ్ల కలక, జ్వరం ఉన్న చిన్నారులు మాత్రలు వేసుకోవద్దు

- డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి

షాద్‌నగర్‌ : కండ్ల కలక, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులు, చిన్నారులు నులిపురుగు మాత్రలు వేసుకోవద్దని షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి తెలిపారు. బుధవారం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రిలో నులిపురుగు నివారణపై వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగులను తరిమి వేసేందుకు వైద్య సిబ్బంది మరింత కృషి చేయాని సూచించారు. పాఠశాలల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు వేసే ముందు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వాటిని ఇవ్వాలని తెలిపారు. మూడు నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రలను నమిలించి మింగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T22:54:18+05:30 IST