Share News

కిక్కిరుస్తున్న బస్సులు

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:13 PM

పెరిగిన బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఆర్థికంగా సతమతం అవుతున్న తమకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో కొంత ఊరట లభించిందని మహిళలు అంటున్నారు.

కిక్కిరుస్తున్న బస్సులు
లాల్‌పహాడ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళలు

ఉచిత ప్రయాణ పథకం బాగుందన్న మహిళలు

చౌదరిగూడ, డిసెంబరు 17: పెరిగిన బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఆర్థికంగా సతమతం అవుతున్న తమకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో కొంత ఊరట లభించిందని మహిళలు అంటున్నారు. మొన్నటి వరకు బస్సు, ఆటో చార్జీలతో కలిగిన ఆర్థిక భారం తగ్గినట్టయిందని వారు పేర్కొంటున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయంతో బస్సులు కిక్కిరుస్తున్నాయి. చార్జీలున్న సమయంలో ఎక్కడికి వెళ్లినా కనీస చార్జీ రూ.30 ఉండేదని, ఆటోలకైతే మరింత ఎక్కువ తీసుకునే వారని అంటున్నారు. ఆర్థికంగా లేని వారు రవాణా చార్జీలకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో తాము స్వేచ్ఛగా బంధువుల వద్దకు, విద్యార్థినులు స్కూళ్లు, కాలేజీలకు సంతోషంగా వెళ్లగలుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సంతోషంగా వినియోగించుకుంటున్నామని ఆదివారం లాల్‌పహాడ్‌లో మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టడంతో ఇప్పుడు బస్సుల్లో రద్దీ ఉందని, రాన్రాను ఇది సాధారణంగా మారి రద్దీ తగ్గుతుందని మహిళలు అన్నారు. అయితే కొందరు ఉచిత ప్రయాణం అని చీటికీ మాటికీ బస్సులు ఎక్కడం సరికాదన్నారు. అవసరం ఉన్న మహిళలే బస్సు ఎక్కితే రద్దీ తక్కువై తోటి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవని మహిళలు అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 17 , 2023 | 11:13 PM