రాజీమార్గమే రాజమార్గం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:02 AM
రాజీమార్గమే రాజమార్గమని హైకోర్టు జడ్జీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సామ్ కోశాయ్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర
న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సామ్ కోశాయ్
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 30 : రాజీమార్గమే రాజమార్గమని హైకోర్టు జడ్జీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సామ్ కోశాయ్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆస్తి, కుటుంబ పరమైన సమస్యలకు సంబంధించిన కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ కేసులు పరిష్కారం చేసుకోవడంలో లోక్అదాలత్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార ముఖ్య కార్యదర్శి గోవర్దన్రెడ్డి మాట్లాడుతూ పలుమార్లు కోర్టుల చుట్టూ తిరగకుండా.. వ్యయ ప్రయాసాలకు గురికాకుండా సత్వరమే కేసులను పరిష్కరించే వేదికయే లోక్ అదాలత్ అని చెప్పారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇ.ఇందిరా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో 38 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేశామని చెప్పారు.
విడిపోయిన జంటను కలిపిన హైకోర్టు జడ్డి
కుటుంబ తగాదాలతో విడిపోయిన ఓ జంటను జాతీయ లోక్ అదాలత్ వేదిక ద్వారా హైకోర్టు జడ్జి పుష్పగుచ్ఛాలు అందించి సుఖ సంతోషంగా జీవించాలని భార్యాభర్తలను కలుపుతూ ఆశీర్వదించారు. ఆ జంట కూడా లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిషరించుకోవడంతో సంతోషం వ్యక్తపరిచారు.
ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన అన్నాతమ్ముళ్లు
కాగా, మరొక సివిల్ పార్టిషన్ దావా కేసులో భాగంగా రాజీ చేసుకోవడంతో ఎన్నో ఏళ్లక్రితం విడిపోయిన అన్నాతమ్ముళ్లు కలిసిపోయారు. ఇష్టపూర్వకంగా కేసును రాజీ చేసుకున్నారు. ఇలాంటి సదవకాశాన్ని కల్పించిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు.
7 లక్షల పైచిలుకు కేసుల పరిష్కారం
లోక్ అదాలత్లో భాగంగా అన్నీ కలిపి సుమారు 7లక్షల పైచిలుకు కేసులు పరిష్కరించబడ్డాయి. అలాగే అన్ని కేసులతో కలిపి రూ.7,60,51,581 వరకు నష్ట పరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శ్రీ పట్టాభి రామరావు, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్, జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వినోద్కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి కస్తూరి, న్యాయవాదులు రాంచందర్, జ్యోతి, రామకృష్ణారెడ్డి, పారాలీగల్ వాలంటీర్లు, కక్షిదారులు పాల్గొన్నారు.