ఒక్కడుగా వచ్చి.. అఖండుడిగా ఎదిగి!
ABN , First Publish Date - 2023-12-05T00:10:38+05:30 IST
ఒక్కడుగా వచ్చి.. అఖండుడిలా ఎమ్మెల్యే అయిన వీర్లపల్లి శంకర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
పార్టీకి పునరుజ్జీవం పోసి ఎమ్మెల్యే అయిన శంకర్
వీర్లపల్లిని అభినందిస్తున్న ప్రజలు, నేతలు
షాద్నగర్, డిసెంబరు 4: ఒక్కడుగా వచ్చి.. అఖండుడిలా ఎమ్మెల్యే అయిన వీర్లపల్లి శంకర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసి జెండా ఎగరేశారని కొనియాడుతున్నారు. పదేళ్ల తర్వాత షాద్నగర్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాండించిన ఘనత వీర్లపల్లి శంకర్కే దక్కిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చౌలపల్లి ప్రతా్పరెడ్డి పోటీ చేశారు. అదే ఎన్నికల్లో టికెట్ ఆశించి శంకర్ పార్టీని వీడి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడారు. ఆ తర్వాత ప్రతా్పరెడ్డి 2019లో బీఆర్ఎ్పలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపే లేకుండా పోయింది. 2021లో శంకర్ బీఎస్పీని వీడి కాంగ్రె్సలో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేశారు. భారత్ జోడో యాత్రలో పార్టీ నేత రాహుల్గాంధీని షాద్నగర్కు రప్పించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో రోడ్ షోలు నిర్వహించారు. అలుపెరగని వీరుడిగా వీర్లపల్లి తన కుటుంబానికి సైతం దూరంగా ఉంటూ పార్టీ బలోపేతాననికి పనిచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా అధిష్టానం వీర్లపల్లికే టికెట్ కట్టబెట్టి వెన్ను తట్టింది. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎ్సలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్పరెడ్డి కాంగ్రె్సలో చేరడం శంకర్ జయానికి ఎంతో దోహదపడింది. ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ ప్రజాభిమానంతో వీర్లపల్లి ఎమ్మెల్యే అయ్యారనడంలో సందేహం లేదు.
అట్టడుగు స్థాయి నుంచి అసెంబ్లీకి...
షాద్నగర్ అర్బన్: ఎక్కడ పుట్టామన్నది కాదు.. ఎక్కడికైనా ఎదగొచ్చన్న ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే ఆశయం నెరవేరుతుందని నిరూపించారు వీర్లపల్లి శంకర్. వ్యవసాయ కూలీ రజక కుటుంబంలో పుట్టిన శంకర్ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అంది పుచ్చుకున్నారు. నందిగామా మండలం వీర్లపల్లికి చెందిన కాసులవాద రామయ్య అంజమ్మ దంపతులకు 1969 మార్చి 15న జన్మించిన శంకరయ్య అలియాస్ శంకర్కు ముగ్గురు చెల్లెళ్లు. పాఠశాల విద్యను నందిగామలో, ఇంటర్మీడియట్ షాద్నగర్ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నగరంలోని సిటీ కాలేజీలో పూర్తి చేశారు. ఒక వైపు పనిచేసుకుంటూ మరో వైపు చదువుతూ, చెల్లెల్లనూ చదివించారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న శంకర్ 1992లోనే కాంగ్రెస్ పార్టీలో చేరి, 1995లో సర్పంచ్గా గెలిచారు. 2004 నుంచి పదేళ్లు కొత్తూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో చౌలపల్లి ప్రతా్పరెడ్డి గెలుపులో కీలకంగా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు కొత్తూరు జెడ్పీటీసీ టికెట్ విజయమై ప్రతా్పరెడ్డితో విభేదించి టీఆర్ఎ్సలో చేరి అంజయ్యయాదవ్ విజయం కోసం పనిచేశారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా 27,814 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి నమ్మిన బంటుగా ఎదిగారు. శంకర్ శ్రమను గుర్తించిన పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. రేవంత్రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతా్పరెడ్డి ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతా్పరెడ్డి, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, కొందరు సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రె్సలో చేరి పార్టీ విజయానికి తోడ్పాటు అందించారు.