పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి
ABN , First Publish Date - 2023-07-21T00:21:53+05:30 IST
పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా అదపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం చిన్నారుల రోగ నిరోధక టీకాల కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
రంగారెడ్డి అర్బన్, జూలై 20 : పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా అదపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం చిన్నారుల రోగ నిరోధక టీకాల కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో చిన్నారులకు టీకాలు వేయించేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 5 సంవత్సరాల వయస్సు పిల్లలకు మీజిల్స్, రుబెల్లా (యంఆర్) న్యూమోకోకల్ (పీసీవీ) వ్యాక్సిన్, అలాగే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కొవిడ్ విపత్కర సమయంలో చిన్నారులకు ఇచ్చిన టీకాల్లో ఏదైనా కారణాలతో కొద్దిమంది పిల్లలకు సంవత్సరం లోపు ఇవ్వాల్సిన పూర్తి టీకాలు ఇవ్వకుంటే.. వారికి వచ్చే నెలలో టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు టీకాలు తీసుకోని పిల్లలను గుర్తిస్తామని ఆమె చెప్పారు. ఆగస్టు 7 నుంచి 12 వరకు, సెప్టెంబరు 11 నుంచి 16 వరకు, అక్టోబర్ 9 నుంచి 14 వరకు టీకాలు ఇస్తామని డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, డీఈవో సుశీందర్రావు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారి బాలేశ్వరి, అదనపు పబ్లిక్ రిలేషన్ అధికారి సుజని, డాక్టర్లు స్వర్ణకుమారి, సృజన, అరుణ, జయలక్ష్మి, ధరణి కుమార్, గీత తదితరులు పాల్గొన్నారు.