బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ రోహిత్రెడ్డికే
ABN , First Publish Date - 2023-05-25T23:19:53+05:30 IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ పైలెట్ రోహిత్రెడ్డికే రాబోతుందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

తాండూరు రూరల్, మే 25: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ పైలెట్ రోహిత్రెడ్డికే రాబోతుందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ వస్తే మహేందర్రెడ్డి పార్టీలో ఉంటానని భద్రేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయగలడా? అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తనకే టికెట్ వస్తుందని, తానే గెలుస్తానని అనడంతో బీజేపీ, కాంగ్రెస్ వారి ఆశలు అడిఆశలయ్యాయని తెలిపారు. రోహిత్రెడ్డి 2008 నుంచి మలిదశ ఉద్యమం వరకు కీలకంగా పనిచేసిన వ్యక్తి అని, బీఆర్ఎస్ నాయకత్వంలో తాండూరు నియోజకవర్గానికి వేలకోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రస్తుతం రోడ్లు, వైద్యం, విద్య పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తే కొందరు రాజకీయ అవగాహన లేని వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాండూరు అభివృద్ధికి మీరు ఎన్ని నిధులు తెచ్చారు, రోహిత్రెడ్డి ఎన్ని నిధులు తీసుకువస్తున్నారనే దానిపై చర్చకు సిద్ధమన్నారు. తాండూరు పట్టణాధ్యక్షుడు నయీంమాట్లాడుతూ రోహిత్రెడ్డి రెండు సంవత్సరాల వ్యవధిలో తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాతా శిశు ఆసుపత్రి, ఐటీఐ, జూనియర్ కళాశాల తాండూరు పట్టణంలోని రోడ్లు అభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ఓ పక్క పేర్కొంటుంటే మరోపక్క కొందరు రోహిత్రెడ్డి అభివృద్ధి చేయడం లేదని ఆరోపించడం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, మైనార్టీ నాయకులున్నారు.