భాస్కరరావుది గొప్ప సంకల్పం
ABN , First Publish Date - 2023-03-26T00:04:17+05:30 IST
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి, ఉన్నతస్థాయిలో స్థిరపడాలనే గొప్ప సంకల్పంతో దివంగత భాస్కరరావు 1998లో భాస్కర విద్యాసంస్థలను స్థాపించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్స్వామి అన్నారు.
ప్రముఖ ఆఽధ్యాత్మిక వేత్త చినజీయర్
ఘనంగా భాస్కర విద్యాసంస్థల
సిల్వర్జూబ్లీ వేడుకలు
మొయినాబాద్ రూరల్, మార్చి 25 : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి, ఉన్నతస్థాయిలో స్థిరపడాలనే గొప్ప సంకల్పంతో దివంగత భాస్కరరావు 1998లో భాస్కర విద్యాసంస్థలను స్థాపించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్స్వామి అన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి పరిధిలో గల భాస్కర విద్యాసంస్థల సిల్వర్జూబ్లీ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. చినజీయర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దివంగత భాస్కరరావు స్థాపించిన విద్యాసంస్థలో చదువుకున్నవారు ఇప్పటివరకు 12వేల మంది దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా విద్యాసంస్థ ప్రముఖ కంపనీలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోందన్నారు. విద్యాలయాలు లాభార్జనే ధ్యేయంగా పనిచేయకుండా.. భావితరాలకు మార్గనిర్దేశకులను తయారు చేయాలనేది భాస్కరరావు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యాసంస్థల కార్యదర్శి జేవీ కృష్ణారావు మాట్లాడుతూ భాస్కర విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు.. నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడినట్లు గుర్తుచేశారు. విద్యాసంస్థల సైనెడ్ ఫౌండర్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్రెడ్డి, ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ గోపాల్రెడ్డి, కొలకలూరి ఇనాక్, వంశీధర్రావు, దీపిక, గాయత్రి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆ సంస్థలో ఇంతకుముందు పనిచేసిన అధ్యాపక బృందాలను జేవీ కృష్ణారావు సన్మానించారు. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవిలో కొనసాగుతున్న కళాశాల విద్యార్థులను కూడా సన్మానించారు.