సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-04-25T23:54:43+05:30 IST

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం జోన్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ డాక్టర్‌ బి.అనురాధ అన్నారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ క్రైమ్‌ డీసీపీ డాక్టర్‌ అనురాధ

ఆదిభట్ల, ఏప్రిల్‌ 25 : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం జోన్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ డాక్టర్‌ బి.అనురాధ అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్‌పల్లిలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళవారం సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌తో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఫోన్‌లో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని, ఒకవేళ స్పందించి సైబర్‌ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 నెంబర్‌కు డయల్‌ చేసి సమాచారం అందించాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల పోగొట్టుకున్న సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉందన్నారు. సైబర్‌ నేరగాళ్లు మహిళలు, పిల్లలను ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారని ఇంటర్నెట్‌ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. ఈమేరకు ఆన్‌లైన్‌ మోసాలు, ఆర్థిక నేరాలు, లోన్‌ యాప్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అత్యవసర సమయంలో 100కు డయల్‌ చేయాలని, 9490617111 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా కంప్లైంట్‌ చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వెంకటేశం, సీఐలు రామకృష్ణ, కిరణ్‌ కుమార్‌, ఎస్‌ఐ మారయ్య, సీవీఆర్‌ కళాశాల చైర్మన్‌ నారాయణరెడ్డి, కో-ఆర్డినేటర్‌ సావిత్రి విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T23:54:43+05:30 IST