రోడ్ల మరమ్మతుకు ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:42 PM
యాచారం మండలంలోని ఫార్మాసిటీలో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభమవుతున్నాయి. రోడ్డు పనులు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాగనున్న ఫార్మాసిటీ రోడ్డు పనులు
రూ.85 కోట్లతో మీర్ఖాన్పేట- యాచారం రోడ్డు విస్తరణ పనులు ఆరంభం
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
యాచారం, డిసెంబరు 18 : యాచారం మండలంలోని ఫార్మాసిటీలో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభమవుతున్నాయి. రోడ్డు పనులు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫార్మాసిటీ రద్దుతో రోడ్డు విస్తరణ పనులు చేస్తారా లేదా అనే అంశంపై ఆంరఽధజ్యోతిలో ఆదివారం ఫార్మాసిటీ సరే..! రోడ్ల మరమ్మతు సంగతేంది ?అనే శీర్షికన వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. మీర్ఖాన్పేట నుంచి యాచారం మండల కేంద్రం వరకు రూ 85కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులను రెండు రోజుల్లో చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం యాచారం మండలం నజ్దిక్సింగారం సమీపంలో సిమెంట్ రెడీమిక్స్ ప్లాంటును బిగిస్తున్నారు. కొత్తగా రోడ్డు వేయడం లేదని, ఉన్న రోడ్డునే విస్తరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మీర్ఖాన్పేట, నజ్దిక్సింగారం గ్రామాలలో సీసీ రోడ్డు వేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ రోడ్డు పనుల సందర్భంగా తమ పట్టా భూములు తీసుకుంటారని ఇప్పటి వరకు రైతులు ఆందోళన చెందారు. ఎలాంటి భూసేకరణ చేయకుండానే నేడున్న రోడ్డు వెడల్పు చేయడం కోసం ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రోడ్డు పక్కన గల ఇళ్లను కొంత మేర తొలగిస్తారా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. రోడ్డు విస్తరిస్తే తమ ఇళ్లు కూలుస్తారా అని జనం ఆందోళన చెందుతున్నారు.