రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

ABN , First Publish Date - 2023-01-26T00:02:08+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆలేడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

కొడంగల్‌ రూరల్‌, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆలేడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కొడంగల్‌ ఎస్సై రవిగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు... ఆలేడ్‌ గ్రామానికి చెందిన బడుసు వెంకటేశ్‌(24) నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం హర్యానాలో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల్లో ఈ నెల 9న స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి తన కారు సర్వీసింగ్‌ చేయించేందుకు స్నేహితులు శ్రీనివా్‌సరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి తాండూర్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆలేడ్‌ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బడుసు వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, స్నేహితులకు గాయాలయ్యాయి. వెంకటేశ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి చంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వాహనం బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి

దౌల్తాబాద్‌, జనవరి 25: బొలేరో వాహనం బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దౌల్తాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్‌ ఏఎస్సై మూతరాజ్‌ తెలిపిన వివరాల మేరకు... దౌల్తాబాద్‌ మండలం చల్లాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బొలేరో(ట్రాలీ) వాహనంలో బుధవారం కర్ణాటక రాష్ట్రం మోత్కుపల్లికి బయలుదేరారు. ఈక్రమంలో దౌల్తాబాద్‌ గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో వాహనంలో ఉన్న రెడ్డి రాజు(27) అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా బుద్యప్ప అనే వ్యక్తికి కాలు విరగడంతో పోలీసులు చికిత్స నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-26T00:02:09+05:30 IST