అన్నదాత ఆగమాగం
ABN , First Publish Date - 2023-05-31T23:08:26+05:30 IST
బొంరాస్పేట్లో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలన్నీ తడిసి పోయాయి.
బొంరాస్పేటలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం
కులకచర్లలో విరిగిన చెట్లు
కీసరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
కీసర/కులకచర్ల/బొంరాస్పేట్, మే31: బొంరాస్పేట్లో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలన్నీ తడిసి పోయాయి. ఇక్కడి ఐకేపీ కేంద్రాన్ని పరిగి, వికారాబాద్ రైస్ మిల్లులను కేటాయించడంతో వారం రోజుల క్రితం వరకు ధాన్యం రవాణా సజావుగా కొనసాగింది. మూడు రోజుల క్రితం నుంచి వికారాబాద్ మిల్లుకు కేటాయించడంతో ఆమిల్లు యజమాని రెండు కిలోల తరుగు తీయడంతో ధాన్యం రవాణా ఎక్కడిక్కడే నిలిచిపోయింది. ఇప్పటికే దాదాపు పది వేల బస్తాల ధాన్యం తూకం వేసి రైతులు పదిహేను రోజులుగా కాపలా ఉంటున్నారు. తాజాగా జడ్చర్ల గోదాం బొంరాస్పేట్ ఐకేపీకి కేటాయించడంతో లారీ యజమానులు చార్జీలు పెంచాలంటూ, ఇటు వికారాబాద్ మిల్లరు రెండు కిలోల తరుగు సాకు చూయించడంతో ఈ దుస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా కేంద్రానికి లారీలు రావడం లేదు, తూకాలు సైతం నిలిచిపోయాయి. బుఽధవారం కురిసిన వర్షానికి ధాన్యపు బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కులకచర్ల మండల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీచాయి. కులకచర్ల గ్రామంలో బీసీ వసతి గృహంలోని చెట్టు విరిగి సమీప ఇంటిపై పడింది. ప్రభుత్వాసుపత్రి పక్కన గల ప్రహరి గోడ కూలిపోయింది. మేడ్చల్ జిల్లా కీసరలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంతరం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి కుండపోత వర్షం కురిసింది. వర్షానికి తోడు ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షానికి విద్యుత్ అధికారులు ముందుస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.