Share News

ప్రతీ కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం

ABN , First Publish Date - 2023-11-22T00:20:08+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్చి నెలలో ప్రతీ కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం ఉచితంగా ఇస్తామని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం
ఇంజాపూర్‌లో మాట్లాడుతున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

హయత్‌నగర్‌, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్చి నెలలో ప్రతీ కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం ఉచితంగా ఇస్తామని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌, మునగనూర్‌, తొర్రూర్‌, బ్రాహ్మణపల్లి, రాగన్నగూడ, మన్నెగూడ, తుర్కయంజాల్‌, కమ్మగూడ గ్రామాల్లోరోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ గ్రామంలో ఇల్లు లేని వారికి 120 గజాల స్థలం ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం వల్ల తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి కొరవడిందన్నారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి 1069 ఉద్యోగాలు వచ్చేలా తన వంతు కృషి చేశానన్నారు. తొర్రూర్‌ రాజీవ్‌ గృహకల్ప లభ్థిదారుల రుణాలు ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్‌ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, కొత్తకుర్మ సత్తయ్య, దండెం రాంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయకులున్నారు.

నమ్మించి మోసం చేసే కాంగ్రెను నమ్మొద్దు

అబ్దుల్లాపూర్‌మెట్‌ : నమ్మించి మోసం చేసే కాంగ్రెస్‌ పార్టీని నమ్మొద్దని బీఆర్‌ఎస్‌ నేత దండెం రాంరెడ్డి అన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం పెద్దఅంబర్‌పేట్‌లోని 5వ వార్డు మైత్రీ సిరిపురంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మంచిరెడ్డిని నాలుగోసారి గెలిపించాలని కాలనీలోని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. కౌన్సిలర్‌ దండెం కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మహిళ అధ్యక్షురాలు చెరుకూరి రేణుకజగన్‌, సత్యనారాయణరెడ్డి, బాలకృష్ణగౌడ్‌, తదితరులున్నారు.

మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

యాచారం/ఇబ్రహీంపట్నం, నవంబరు 21 : తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోమారు ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కిషన్‌రెడ్డి కోడలు మౌనికారెడ్డి ఓటర్లను కోరారు. మంగళవారం యాచారం మండలం నజ్ధిక్‌సింగారం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో సర్పంచ్‌ అరుణ, పాండురంగారెడ్డి, లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఓటర్లను కలిసి మంచిరెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మంచిరెడ్డి చేసిన అభివృద్ధి, గతంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు.

Updated Date - 2023-11-22T00:20:10+05:30 IST