New Secretariat: సచివాలయ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరం

ABN , First Publish Date - 2023-04-30T16:23:36+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (Dr. BR Ambedkar) పేరుతో అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి.

New Secretariat: సచివాలయ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరం

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (Dr. BR Ambedkar) పేరుతో అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి. సచివాలయ (Secretariat) నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని సగర్వంగా చెప్పిన సీఎం కేసీఆర్ (CM KCR).. ప్రతిపక్షాలను ఆహ్వానించడంలో ప్రొటోకాల్ (protocol) పాటించలేదు. సచివాలయం పాలనా పరమైన వ్యవహారాలకు కేంద్ర బిందువు. రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన కొత్త సచివాలయ ప్రారంభోత్సవంలో ప్రజల చేత ఎన్నికైనా ఎంపీ, ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అగౌరవ పరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు సీఎస్, సీఎంవో నుంచి ఆహ్వానాలు పంపాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా జేసీలతో ఫోన్ ద్వారా విపక్ష నేతలకు సమాచారం పంపి చేతలు దులుపుకుంది. దీంతో తమకు కనీస మర్యాద కూడా పాటించలేదని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

అందుకే ప్రారంభోత్సవానికి విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ప్రజల సొమ్ముతో కట్టిన సెక్రటేరియేట్‌లో ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ తన సొంత కార్యక్రమంలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి కేవలం రాజ్యాంగ నిర్మాత పేరు వాడుకునేందుకే ప్రభుత్వం సచివాలయానికి పేరు పెట్టి, విగ్రహాన్ని కట్టిందే తప్ప.. ఆయన ఆశయాలను, మార్గాన్ని అనుసరించే ఆలోచనే లేదని చెప్పకనే చెబుతున్నాయి. కానీ.. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఇతర రాష్ట్రాల మీడియాకు తెలంగాణ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. పంజాబ్‌, ఢిల్లీ, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 70 మందికి పైగా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. వారికి రానుపోను విమాన చార్జీలనూ భరిస్తోంది. వారి బస కోసం ఓ స్టార్‌ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. మీడియాకు ఇచ్చిన గౌరవం కూడా విపక్ష ప్రజా ప్రతినిధులకు ఇవ్వలేదని సదరు నేతలు వాపోతున్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ఆంక్షల చట్రం ఆరంభమైంది. రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన కొత్త సచివాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, విలేకరులకూ ఆహ్వానాలు పంపింది. కానీ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి’కి ఆహ్వానాన్ని నిరాకరించింది. నిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ.. తెలుగు రాష్ట్రాల పౌరుల మన్ననలు పొందుతున్న ఆంధ్రజ్యోతి, కొత్త సచివాలయంలోకి అడుగు పెడితే, మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ సౌధంలోకి మీడియాపై ఆంక్షలు విధించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్ర సచివాలయంలోనూ ఇలాంటి ఆంక్షల్లేవు. అయితే.. ప్రజాస్వామ్య ఫలాలను అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుపెట్టుకుని, అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉంది. ఒక్క ఆంధ్రజ్యోతే కాకుండా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ఒకట్రెండు మీడియా సంస్థలకూ ఆహ్వానాన్ని సర్కారు నిరాకరించింది. అంతేకాదు.. జాతీయ మీడియాకు ప్రాతినిధ్యం వహించే 20 మంది స్థానిక ప్రతినిధులకూ తొలుత పాస్‌లను నిరాకరించినట్లు సమాచారం.

Updated Date - 2023-04-30T16:38:36+05:30 IST