Kanti Velugu: కోటి మందికి చేరువగా కంటి వెలుగు

ABN , First Publish Date - 2023-03-31T22:13:44+05:30 IST

కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతోంది.

Kanti Velugu: కోటి మందికి చేరువగా కంటి వెలుగు
Telangana Kanti Velugu

హైదరాబాద్: నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభించిన కంటి వెలుగు(Kanti Velugu) కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18న, సీఎం కేసీఆర్‌తో( KCR) పాటు, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయ్ విజయన్ చేతుల మీదుగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను దూరం చేస్తోంది. 47 పనిదినాల్లో ఇప్పటి వరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి కాగా, కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతోంది.

దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్ లో ప్రారంబించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి కొనసాగిస్తోంది.

రెండో విడ‌త‌లో ఇప్పటి వరకు 47 పనిదినాల్లో మొత్తం 96,07,764 మందికి కంటి పరీక్షలు చేయగా, 60.55 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇందులో 45 లక్షల మంది పురుషులు, 50 లక్షల మంది స్త్రీలు, 3112 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం గుర్తించడం జరిగింది. 68.73 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది.

ల‌క్ష్యంగా నిర్దేశించుక‌న్న 100 పనిదినాల్లో రాష్ట్రంలో అందరికి పరీక్షలు పూర్తి చేస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) చెప్పారు. కంటి వెలుగు సమయంలో ఇతర వైద్య సేవలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వైద్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖలు సహా, అందరు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. పర్యవేక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నామన్నారు.

Updated Date - 2023-03-31T22:16:45+05:30 IST