అభయ హస్తం డబ్బులు ఇచ్చేది ఎప్పుడో?
ABN , First Publish Date - 2023-03-02T00:25:29+05:30 IST
అభయ హస్తం పథకం ఆగిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం అప్పట్లో మహిళా సంఘాలు కట్టిన డబ్బులను మాత్రం తిరిగి చెల్లించలేదు.
- గత సంవత్సరం డబ్బులు తిరిగి ఇచ్చేందుకు లబ్ధిదారుల వివరాల సేకరణ
- వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిన అధికారులు.. ఇంత వరకు పడని డబ్బులు
- 25వేల మందికి పైగా ఎదురుచూపులు
- పథకం ఎత్తేసి దాదాపు ఏడేళ్లు అవుతున్న డబ్బులు రాని పరిస్థితి
కామారెడ్డి టౌన్, మార్చి 1: అభయ హస్తం పథకం ఆగిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం అప్పట్లో మహిళా సంఘాలు కట్టిన డబ్బులను మాత్రం తిరిగి చెల్లించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పింఛన్ పథకానికి మహిళా సంఘాల్లో 55 సంవత్సరాలు దాటిన వారు డబ్బులు కడితే వారికి నెలకు రూ.500 చొప్పున డబ్బులు అందించే విధంగా పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయహస్తాన్ని ఎత్తివేసింది. ఈ పథకం అమలు చేసిన సమయంలో జిల్లా నుంచి దాదాపు 25వేల మందికిపైగా డబ్బులు కట్టారు. పథకం ఎత్తివేసి ఏడు సంవత్సరాలు గడస్తున్నా డబ్బులు తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
కొన్నేళ్ల క్రితం నిలిపివేత
అభయహస్తం పథకంలో చేరేందుకు అప్పట్లో 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారిని అర్హులుగా నిర్ణయించారు. 55 సంవత్సరాలు దాటిన మహిళలు ఏడాదికి రూ.500 చొప్పున 10ఏళ్ల పాటు చెల్లిస్తే వారి వయస్సు 60 ఏళ్లు దాటగానే జీవితాంతం నెలకు రూ.500 చొప్పున చెల్లించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైన సభ్యురాలు చనిపోతే సహజ మరణానికి రూ.35 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75వేలు చెల్లిస్తారు. దహన సంస్కారాలకు తక్షణ సహాయంగా రూ.5 వేలను అందిస్తారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి బీమా ప్రీమియం చెల్లించిన వారి పిల్లలు చదువుకుంటే(ఇద్దరికి) ఉపకార వేతనాలను కూడా అందజేశారు. 8,9,10 తరగతులతో పాటు ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాన్ని అందించే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. అప్పట్లో వృద్ధాప్య పింఛన్ రూ.200 ఉండగా మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం రూ.2016కు పెంచింది. దీంతో ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నిలిపి వేసింది.
వివరాలు సేకరించి సంవత్సరం గడుస్తున్నా ఇంకా అందని డబ్బులు
2009 నుంచి 2014 వరకు డ్వాక్రా సంఘాల మహిళలు చెల్లించిన డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రభుత్వం తెలిపి వివరాలు సేకరించాలని డీఆర్డీఏ, మెప్మా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు వివరాల సేకరణ చేసి ప్రభుత్వానికి అందించారు. అభయహస్తం బాండు, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు, సెల్ నెంబర్లను సేకరించారు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు చేసి సదరు సిబ్బంది పంపాక డబ్బులను ఖాతాల్లో జమ చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు అందించి దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించలేదు. దాదాపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25వేల మందికి పైగా మహిళా సంఘాల సభ్యులు అభయహస్తం డబ్బుల కోసం వేచి చూస్తున్నారు.