ఎల్ఆర్ఎస్ ఏమైనట్లు?
ABN , First Publish Date - 2023-02-12T22:16:49+05:30 IST
అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణతో స్థానిక సంస్థలకు ఆదాయం, విక్రయదారులకు ఊరట లభిస్తుందని భావించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం కలుగడం లేదు.
- పెండింగ్లో లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ
- రెండేళ్లుగా ఎదురుచూపులు
- దరఖాస్తుదారుల్లో అయోమయం
- గ్రామ పంచాయతీ పరిధిలో 32వేలకు పైగానే అక్రమ ప్లాట్లు
- మున్సిపాలిటీల్లో 16 వేలకు పైగా నాన్ లేఅవుట్ ప్లాట్లు
కామారెడ్డి(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 12: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణతో స్థానిక సంస్థలకు ఆదాయం, విక్రయదారులకు ఊరట లభిస్తుందని భావించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మోక్షం కలుగడం లేదు. లే అవుట్ లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా అమ్మకాలు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల కింద లేఅవుట్లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చాలా తగ్గిపోయాయి. ఆదాయం కూడా తగ్గడంతో ప్రభుత్వం పునరాలోచించింది. ఆన్లైన్లో రూ.1000 ఫీజు చెల్లించి లేఅవుట్లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుకోవచ్చని ఆదేశించింది. దీంతో లే అవుట్లేని ప్లాట్ల యజమానులు ఆన్లైన్లో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల రూపేనా ప్రభుత్వానికి కాస్త ఆదాయం సమకూరింది. కానీ లేఅవుట్లను పరిశీలించకపోవడంతో ఆయా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు 33 శాతం జరిమానా రూపేనా రావాల్సిన ఆదాయం రావడం లేదు. దీంతో స్థానిక సంస్థలకు ఎల్ఆర్ఎస్తో ఆదాయం సమకూరడం లేదు. జిల్లాలో ఎల్ఆర్ఎస్పై వచ్చిన 30 వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇస్తే గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరుతుందని మున్సిపల్, పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు
జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 30 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు పరిశీలించడానికి ఇప్పటికే సర్వే నెంబర్లు, స్థల విస్తీర్ణం ప్రకారం క్లస్టర్లుగా విభజించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళికల విభాగాల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులంతా ఆన్లైన్లో రూ.1000 చెల్లించారు. ఇళ్లు కట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం నిర్ణయంతో మేలు చేకూరే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే లే అవుట్లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గ్రీన్సిగ్నల్ సైతం ఇచ్చింది. అంతేకాకుండా ప్లాట్లకు మార్కెట్ విలువలో 33 శాతం జరిమానాతో క్రమబద్ధీకరించాలనే ఆదేశాలు ఉన్నాయి.
వీటికి మాత్రమే అనుమతి
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అనధికార లేఅవుట్లలో రిజిస్టర్ సెల్డీడ్ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లకు అనుమతి ఇవ్వనున్నారు. కనీసం 10 శాతం ప్లాట్ల రిజిస్టర్ సెల్డీడ్ ద్వారా విక్రయించిన అనధికార లే అవుట్లకు, సెల్డీడ్ లేదా టైటిల్డీడ్ తప్పనిసరిగా ఉండాలి. అసైన్ భూముల్లో ప్లాట్లు, లే అవుట్లు ఉంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోనున్నారు. నిషేధిత జాబితాలో భూములను ప్లాట్లుగా మార్చితే వాటిని ఎల్ఆర్ఎస్కు రిజక్ట్ చేయనున్నారు. భూ గరిష్ట పరిమితి చట్టానికి భిన్నంగా ఉన్నవి, సరిహద్దులు మొదలైన వివాదాలు ఉంటే అనుమతి నిరాకరించనున్నారు. జీవో 111లో నిర్ధేశించిన ప్రాంతాలు చెరువులు, ఎఫ్డీఎల్ పరిధిలో ఉన్నవి, నాలాకు రెండు మీటర్ల లోపు ఉంటే వాటికి అనుమతి నిరాకరించనున్నారు. అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను మొదట మున్సిపాలిటీ, పంచాయతీల వారీగా వేరు చేస్తారు. తర్వాత గ్రామ సర్వే నెంబర్, కాలనీ, వార్డుల వారీగా విభజిస్తారు. రెండో దశలో అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలిస్తారు. రెవెన్యూ, నీటి పారుదల పంచాయతీరాజ్ శాఖలు, పట్టణ ప్రణాళిక అఽధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఎల్ఆర్ఎస్ నిబంధనలకు లోబడి ఉన్న వాటి వివరాలు మున్సిపల్ కమిషనర్కు అందించనున్నారు. అనంతరం వాటిని జిల్లా కలెక్టర్ అనుమతితో ఆమోదిస్తారు.
రెండేళ్లుగా ఎదురుచూపులు
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూడక తప్పడం లేదు. జిల్లాలోని 526 గ్రామ పంచాయితీల్లో 10 వేలకు పైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు రాగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన పరిశీలన కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోతో పాటు నియమ నిబంధనలను విడుదల చేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీలను గత సంవత్సరం ఆగస్టులోనే నియమించింది. కానీ ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అంశం హైకోర్టులో ఉండడంతో ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్పై ఎలాంటి స్పష్టత లేకుండా పెండింగ్లో ఉండిపోయినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.