నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
ABN , First Publish Date - 2023-01-18T00:13:45+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. కంటి వెలు గు కేవలం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించినది మాత్రమేకాదని.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టిగా విజయవంతం చేయాలి : కలెక్టర్
నిజామాబాద్అర్బన్, జనవరి 17: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. కంటి వెలు గు కేవలం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించినది మాత్రమేకాదని.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం కంటి వెలుగు కార్యక్రమ ఏర్పా ట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు విధులను నిర్వహించడంలో అలసత్వ వైఖరి ప్రదర్శించిన బోధన్ హోమియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైమవతిని సస్పెండ్ చేయాల్సిందిగా డీఎంహెచ్వోను ఆదేశించారు. తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తూ, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవా
ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ తేల్చిచెప్పారు. వైద్య బృందాలు సమయపాలన పాటిస్తూ ప్రతిరోజూ ఉదయం 8.30గంటలకే తమకు కేటాయించిన శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. 18 సంవత్సరాల పైబడిన ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రతిరోజూ 120 నుంచి 130 మందికి కంటి పరిక్షలు నిర్వహించేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. శిబిరాల్లోనే అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించాలని, క్యాటరాక్ట్ సర్జరీ అవసరమైన వారిని నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రికి రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు.
‘ఉపాధి’ పనుల ఆడిట్ వివరాలను అప్లోడ్ చేయాలి..
ఉపాధిహామీ పథకం పనుల ఆడిట్ వివరాలను సంబంధిత పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఏపీవోలను ఆదేశించారు. మంగళవారం నాటికి అప్లోడ్ ప్రక్రియను పూర్తిచేయాలని గడువు విధించారు. కూలీల ప్రమాణీకరణ ప్రక్రియను తప్పిదాలు లేకుండా సోమవారంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ నిధులతో చేపట్టే సీసీరోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం నిర్ణీత గడువులోపు జీపీలు, మండల పరిషత్ల తీర్మానాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, డీఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ కృష్ణ, డీఆర్డీఏ పీడీ సంజీవ్, ఆయా మండలాల అదికారులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్అర్బన్: కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 19న జిల్లాకేంద్రంలోని వినాయక్నగర్లో గల మహిళా భవనంలో ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు విస్తృతస్థాయిలో చేపడుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్, ఆర్డీవో రవి, డీఎంహెచ్వో సుదర్శనం, ఇతర అధికారులు ఉన్నారు.