ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

ABN , First Publish Date - 2023-04-12T00:39:11+05:30 IST

మహాత్మా జ్యోతాబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అధ్యక్షతవహించగా జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొన్నారు.

ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే, కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 11: మహాత్మా జ్యోతాబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అధ్యక్షతవహించగా జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొన్నారు. అంతకముందు వినాయక్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పూలే కృషిని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పూలేను తన గురువుగా ప్రకటించడం పూలే గొప్పతనానికి నిదర్శనమన్నారు. బీసీ సంఘాల విజ్ఞప్తి మేరకు నగరంలో బీసీ స్టడీ సర్కిల్‌, బీసీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. పూలే వంటి మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలోని చెడును అంతమొందించేందుకు సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబా పూలే చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్‌ నీతూకిరణ్‌, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, మెప్మా పీడీ రాములు, బీసీ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ కార్యాలయంలో

జ్యోతిబా పూలే జయంతిని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కేశవేణు, బీసీ సెల్‌ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌ తదితరులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం బీసీలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రం విడుదల చేశారు. అలాగే జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు వినోద్‌కుమార్‌ తదితరులు వినాయక్‌నగర్‌లోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

Updated Date - 2023-04-12T00:39:12+05:30 IST