పొగాకు నియంత్రణపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2023-02-06T23:24:41+05:30 IST
పొగాకు నియంత్రణపై జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కామారెడ్డిటౌన్, ఫిబ్రవరి 6: పొగాకు నియంత్రణపై జూనియర్,డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోగతాగడం వల్ల విద్యార్థులకు కలిగే అనర్థాలను వివరించాలని తెలిపారు. మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, వైద్యులు ధ్రువీకరించిన మందుల చీటీ ఆధారంగా మెడికల్ నిర్వాహకులు మందులను అందించాలని సూచించారు. మెడికల్ నిర్వాహకులు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా ఎక్సైజ్అధికారి రవీందర్రాజు, జిల్లా నోడల్ అధికారి షేక్సలాం, జిల్లా బాలలసంరక్షణ అధికారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
పదోతరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన కొత్తమోడల్ పేపర్ స్టడీ మెటీరియల్ను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పరీక్షల విభాగం అధికారి నీలం లింగం తదితరులు పాల్గొన్నారు.
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా విద్యార్థులు పోటీపరీక్షలకు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.