ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-03T00:56:25+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 2: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విక్రంరెడ్డి, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ముక్తాపూర్‌ గ్రామానికి చెందిన బద్దం రాజు(26) గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రాజు మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అయితే గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం సేవించిన రాజు కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి రాజు బయటకు వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పరిసరాల్లో అతడి కోసం ఆరా తీశారు. అయినా జాడ కనిపించలేదు. ఎప్పుడూ బెదిరించినట్లే బెదిరించాడేమోనని వారు అనుకున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన దేవగారి బాలయ్యకు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవక మనస్తాపంతో ఉరివేసుకున్నాడని భార్య తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతి పేద కుటుంబీకుడైన రాజు మృతితో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతడి అంత్యక్రియలకు సైతం స్థానికులు విరాళాలు పోగు చేసి నిర్వహించారు.

Updated Date - 2023-06-03T00:56:25+05:30 IST