విస్తరిస్తున్న కళ్లకలక వ్యాధి
ABN , First Publish Date - 2023-08-02T00:30:53+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలుల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులతో మోత్కూరు మండలంలో కళ్లకలక వ్యాధి వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే ఒకరి తర్వాత మరొకరికి తేలికగా సోకే వ్యాధి ఇది. సమూహంగా ఉండేవారిలో.. విద్యార్థుల వసతి గృహాల్లో ఒకరికి వస్తే మిగతా వారికి తొందరగా వ్యాపిస్తుందంటున్నారు.
మోత్కూరు, ఆగస్టు 1: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలుల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులతో మోత్కూరు మండలంలో కళ్లకలక వ్యాధి వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే ఒకరి తర్వాత మరొకరికి తేలికగా సోకే వ్యాధి ఇది. సమూహంగా ఉండేవారిలో.. విద్యార్థుల వసతి గృహాల్లో ఒకరికి వస్తే మిగతా వారికి తొందరగా వ్యాపిస్తుందంటున్నారు. విద్యార్థులకే కాకుండా బయట వ్యక్తులకు కూడా కళ్లకలక వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మోత్కూరు కస్తూర్భా పాఠశాలలో నాలుగైదు రోజులుగా విద్యార్థినులకు కళ్లకలక రావడంతో వారికి చికిత్స చేయించి, ఇళ్లకు పంపించగా తగ్గడంతో తిరిగి పాఠశాలకు వస్తున్నట్లు సమాచారం. విద్యార్థినులకే కాకుండా టీచర్లకు కూడా కళ్లకలక వచ్చినట్లు చెబుతున్నారు. కస్తూర్భా పాఠశాలలో సుమారు వందమంది విద్యార్థినులకు కళ్లకలక వచ్చి తగ్గిందని చెబుతున్నారు. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ముగ్గురికి కళ్లకలక వచ్చినట్లు గుర్తించి మంగళవారం వారిని ఇళ్లకు పంపినట్లు తెలిసింది. మిగతా విద్యార్థి వసతి గృహాల్లోనూ పలువురు విద్యార్థులకు కళ్లకలక వ్యాధి వచ్చిందని, వెంటనే వారిని వేరుగా ఉంచడం, లేదా ఇళ్లకు పంపించడం చేస్తున్నారని చెబుతున్నారు. బయటి వ్యక్తులు కూడా రోజూ కొంత మంది కళ్లకలక వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు చెప్పారు.
గురుకుల పాఠశాలలో కళ్లకలక
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్నారాయణపురం మండలంలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఇళ్లకలకతో ఇబ్బందులుపడుతున్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో 30 మంది, సర్వేల్ గురుకుల పాఠశాలలో 35మంది, కళాశాలలో ఎనిమిది మంది, సంస్థాన్నారాయణపురంలోని ఆదర్శ పాఠశాలలో ముగ్గురు కళ్లకలక బారినపడ్డారు. ఈ విద్యార్థులను వారి స్వగ్రామాలకు పంపించారు.